బ్రౌన్ డాగ్, మంకీ అంటూ..
మూడో టెస్ట్ నాలుగోరోజు ఆటలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్ను కొందరు అభిమానులు 'బ్రౌన్ డాగ్, బిగ్ మంకీ' అంటూ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. దీంతో సిరాజ్ కెప్టెన్ రహానే సాయంతో అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఇక ఆటను నిలిపివేసిన అంపైర్లు పోలీసులను రంగంలోకి దింపారు. తనపై కామెంట్ చేసిన వారిని సిరాజ్ గుర్తించడంతో పోలీసులు వాళ్లను స్టేడియం నుంచి బయటికి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. ఈ ఘటనపై బీసీసీఐతో పాటు మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా ఈ వ్యవహారంపై క్షమాపణలు కోరింది.
సారీ సిరాజ్ బాయ్..
ఈ నేపథ్యంలోనే వార్నర్ భారత జట్టుతో పాటు సిరాజ్కు క్షమాపణలు చెప్పాడు. 'మళ్లీ క్రికెట్ ఆడటం చాలా గొప్పగా ఉంది. అయితే ఆశించిన ఫలితం రాలేదు. ఇది టెస్ట్ క్రికెట్.. ఐదు రోజుల పాటు పోటాపోటీగా మ్యాచ్ జరిగింది. డ్రా కోసం విరోచితంగా పోరాడిన భారత జట్టుకు అభినందనలు. సిరీస్ డిసైడర్ బ్రిస్బెన్ టెస్ట్ కోసం ఆతృతగా ఉన్నా. ఆడటానికి గబ్బా అద్భుతమైన ప్రదేశం. ఇక నేను వివక్షకు గురైన సిరాజ్కు, భారత జట్టుకు క్షమాపణలు చెబుతున్నా. వివక్షపూరితమైన వ్యాఖ్యలు ఎక్కడైనా.. ఎప్పుడైనా ఆమోదయోగ్యం కాదు. మా అభిమానులు ఇలా చేస్తారని ఊహించలేదు. భవిష్యత్తులో మంచిగా ప్రవర్తిస్తారని అనుకుంటున్నా'అని పేర్కొన్నాడు.
వీధి రౌడీల్లా ప్రవర్తించారు
ఇక ఈ జాత్యహంకార వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నాడు. 'ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో కొందరు అభిమానులు వీధి రౌడీలకంటే దారుణంగా ప్రవర్తించారు. జెంటిల్మెన్ గేమ్కు పెట్టింది పేరైన క్రికెట్లో జాత్యహంకార వ్యాఖ్యలు సహించరానివి. గ్రౌండ్లో ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు చూశాం.. కానీ ఇవాళ చేసిన పని అసలు సిసలు రౌడీ ప్రవర్తనకు నిదర్శనంగా కనిపిస్తోంది. వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటివి జరగకుండా బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి'ట్వీట్లో పేర్కొన్నాడు.