అండర్ 19 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో భారత పేసర్ రాజ్ లింబానీ(3/38) రఫ్పాడించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది.
హర్జాస్ సింగ్(64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ హ్యూ వీబ్జెన్(66 బంతుల్లో 5 ఫోర్లతో 48), ఓలివర్ పీక్(43 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 46 నాటౌట్), హ్యారీ డిక్సాన్(56 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

భారత బౌలర్లలో రాజ్ లింబానీ(3/38) మూడు వికెట్లు తీయగా.. నమాన్ తీవారీ(2/63), సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ సామ్ కోన్స్టాస్(0)ను రాజ్ లింబానీ క్లీన్ బౌల్డ్ చేయగా.. కెప్టెన్ హ్యూ వీబ్జెన్, హ్యరీ డిక్సాన్ జట్టును ఆదుకున్నారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని నమాన్ తీవారీ విడదీసాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
తన మరుసటి ఓవర్లో హ్యారీ డిక్సన్(42)ను క్యాచ్ ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో హర్జాజ్ సింగ్.. వికెట్ కీపర్ ర్యా హిక్స్తో కలిసి ఆచితూచి ఆడాడు. రాజ్ లింబానీ.. ర్యాన్ హిక్స్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించడంతో నాలుగో వికెట్కు నమోదైన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఓలివర్ పీక్(46 నాటౌట్)తో కలిసి హర్జాస్ సింగ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అతని జోరుకు సౌమీ పాండే బ్రేక్ వేసాడు. వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో ఆసీస్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. రాఫ్ మెక్మిల్లన్(2)ను ముషీర్ ఖాన్ సూపర్ రిటర్న్ క్యాచ్తో పెవిలియన్ చేర్చగా.. చార్లీ అండర్సన్(13) రాజ్ లింబానీ ఔట్ చేశాడు. దాంతో ఆసీస్ 253 పరుగులకే పరిమితమైంది.