అండర్ 19 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మెగా టోర్నీ ఆడుతున్న తెలంగాణ కుర్రాళ్లు అరవెల్లి అవనీష్ రావు, మురుగణ్ అభిషేక్ తెలుగులో మాట్లాడుకున్నారు. వికెట్ కీపర్ అయిన అవనీష్ రావు.. స్పిన్ ఆల్రౌండర్ అయిన అభిషేక్ కొన్ని బౌలింగ్ సూచనలు చేశాడు.
'సేమ్ బాల్ వేయ్రా.. బాగుంది. స్వీప్ కొట్టినా ఏం కాదు. రెండే షాట్స్ ఆడుతాడు. ఏం కాదు.'అని అవనీష్ రావు తెలుగులో అన్నాడు. ఈ మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అవ్వగా.. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.

'ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ..! మరి ఈరోజు U19 ఫైనల్స్ లో అదే జరిగింది. మరి మీరు కూడా చూసేయండి 'అని ఈ వీడియోకు క్యాప్షన్గా పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అచ్చ తెలంగాణలో మాట్లాడిన ఈ మాటలకు తెలుగు అభిమానులు ఫిదా అవుతున్నారు. అవనీష్ రావుది సిరిసిల్ల కాగా.. మురుగన్ అభిషేక్ది హైదరాబాద్. ఈ ఇద్దరూ అండర్ 19 ప్రపంచకప్ ఎంపికవ్వగా.. తెలంగాణ మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ హ్యూ వీబ్జెన్(66 బంతుల్లో 5 ఫోర్లతో 48), ఓలివర్ పీక్(43 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 46 నాటౌట్), హ్యారీ డిక్సాన్(56 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత బౌలర్లలో రాజ్ లింబానీ(3/38) మూడు వికెట్లు తీయగా.. నమాన్ తీవారీ(2/63), సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్.. 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అర్షిన్ కులకర్ణి(3) ముషీర్ ఖాన్(22) విఫమవ్వగా.. క్రీజులో ఆదర్శ్ సింగ్(12 నాటౌట్), కెప్టెన్ ఉదయ్ సహరణ్(1 నాటౌట్) ఉన్నారు.