ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా 6 ఓటముల తర్వాత విజయాన్నందుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 35 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ సీజన్లో సరిగ్గా నెల రోజుల తర్వాత ఆర్సీబీ విజయాన్నందుకుంది. మార్చి 25న పంజాబ్ కింగ్స్పై గెలుపొందిన ఆర్సీబీ.. మళ్లీ తాజా మ్యాచ్లోనే విజయం సాధించింది. ఈ గెలుపుపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ గెలుపుతో ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకుంటామని చెప్పాడు.

'గత రెండు మ్యాచ్ల్లో మేం అద్భుత పోరాట పటిమ కనబర్చాం. సన్రైజర్స్ హైదరాబాద్ 270 ప్లస్ రన్స్ చేస్తే మేం 260 పరుగులు చేశాం. కేకేఆర్తో ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలయ్యాం. విజయం ముంగిట బోల్తా పడ్డాం. జట్టులోని ఆటగాళ్లంతా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే విజయాలు సాధించడం ముఖ్యం. ఈ రోజు రాత్రి మేం ప్రశాంతంగా నిద్రపోతాం.
మాటలతో జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచలేం. అద్భుత ప్రదర్శనలే ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. ఈ టోర్నీలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. జట్లన్నీ చాలా బలంగా ఉన్నాయి. 100 శాతం ఎఫర్ట్ పెట్టకపోతే నిరాశే ఎదురవుతుంది. మా జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే పరుగులు చేస్తున్నారు. ఫస్టాఫ్ టోర్నీలో విరాట్ కోహ్లీ ఒక్కడే రాణించాడు.
కామెరూన్ గ్రీన్ ఫామ్లోకి రావడం మాకు కలిసొచ్చే అంశం. చిన్నస్వామి స్టేడియం మాకు చాలా పెద్ద సమస్యగా మారింది. ఆ మైదానంలో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. మేం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాం. కానీ సాధ్యమవ్వడం లేదు.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 51), రజత్ పటీదార్(20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కామెరూన్ గ్రీన్(20 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్)మెరుపులు మెరిపించాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/30) మూడు వికెట్లు తీయగా.. టీ నటరాజన్(2/39)రెండు వికెట్లతో సత్తా చాటాడు. ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండేకు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓటమిపాలైంది. అభిషేక్ శర్మ(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31), ప్యాట్ కమిన్స్(15 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 31), షెహ్బాజ్ అహ్మద్(37 బంతుల్లో ఫోర్, సిక్స్తో 40 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, యశ్ దయాల్ తలో వికెట్
తీసారు.