సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు(2021 జనవరి 19) టీమిండియా చరిత్ర సృష్టించింది. టీమిండియా వెన్నుముక విరాట్ కోహ్లీ లేకున్నా.. సగం జట్టు గాయాలతో దూరమైనా.. కరోనా బయోబబుల్ వివాదాలు చుట్టుముట్టినా.. జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైనా.. 36 పరుగులకే కుప్పకూలి ఘోర అవమానం ఎదురైనా.. భారత్ విజయం ఆగలేదు.
సమష్టి ప్రదర్శనతో పటిష్ట ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టికరిపించిన అజింక్యా రహానే నేతృత్వంలోని యంగ్ ఇండియా చారిత్రత్మక విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, శార్దూల్ ఠాకూర్, నవ్దీప్ సైనీ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆశలు అడుగంటిన వేళ అసాధారణ పోరాట పటిమ చూపెట్టారు. అరంగేట్ర సిరీస్లోనే సత్తా చాటి ఆసీస్ను కోలుకోలేని దెబ్బతీశారు. 1988 తర్వాత బ్రిస్బేన్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడని ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించారు. టీ20 ఆటగాళ్లుగా గుర్తింపు పొందిన ఈ యువ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్లో ఇలా రాణిస్తారని ఎవరూ ఊహించలేదు. వీరికి అవకాశాలు కూడా నేరుగా ఏం రాలేదు. సీనియర్ ఆటగాళ్ల గాయాలతోనే వీళ్లంతా ఒక్కొక్కరుగా అవకాశాలు దక్కించుకున్నారు.
మెల్బోర్న్ టెస్ట్లో సిరాజ్, సిడ్నీ టెస్ట్తో నవ్దీప్ సైనీ, బ్రిస్బేన్ టెస్ట్తో సుందర్, నటరాజన్ అరంగేట్రం చేశారు. శార్దూల్ కూడా ఆఖరి మ్యాచ్లోనే అవకాశం దక్కించుకున్నాడు. కానీ ఈ ఐదుగురు అనుభవం లేకున్నా ఆతిథ్య జట్టును వణికించారు. సైనీ ఒక్కడే గాయంతో కొంత ఇబ్బంది పడ్డా.. మిగతా నలుగురు అదరగొట్టారు.
డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అసాధారణ బ్యాటింగ్తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఐదు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ అసలు సిసలు టెస్ట్ మజాను అందించింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా.. లోయరార్డర్ బ్యాటర్లు వాషింగ్టన్ సుందర్(62), శార్దూల్ ఠాకూర్ రికార్డ్ భాగస్వామ్యంతో 336 పరుగులు చేసింది.
33 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆసీస్.. సిరాజ్(5/73), శార్దూల్ ఠాకూర్(4/61) సంచలన బౌలింగ్తో 294 పరుగులే చేసింది. దాంతో భారత్ ముందు 327 పరుగుల లక్ష్యం నమోదయ్యింది.
ఈ లక్ష్యాన్ని భారత్ 7 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసి ఛేదించింది. ఇన్నింగ్స్ చివర్లో రిషభ్ పంత్ (89 నాటౌట్; 138 బంతుల్లో 9x4, 1x6), వాషింగ్టన్ సుందర్ (22) ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించారు.