అండర్ 19 ప్రపంచకప్ 2024లో టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన యువ భారత్.. కీలక పోరులో మాత్రం దారుణంగా విఫలమైంది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో 79 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. ఫైనల్ ఒత్తిడికి చిత్తయిన భారత కుర్రాళ్లు ఘోర పరాజయంతో టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని చేజార్చుకున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ హ్యూ వీబ్జెన్(66 బంతుల్లో 5 ఫోర్లతో 48), ఓలివర్ పీక్(43 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 46 నాటౌట్), హ్యారీ డిక్సాన్(56 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

భారత బౌలర్లలో రాజ్ లింబానీ(3/38) మూడు వికెట్లు తీయగా.. నమాన్ తీవారీ(2/63), సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(77 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 47), హైదరాబాద్ ప్లేయర్ మురుగణ్ అభిషేక్( 46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. లీగ్ దశలో సెంచరీల మోత మోగించిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్(22), సచిన్ దాస్(9), కెప్టెన్ ఉదయ్ సహరణ్(8) దారుణంగా విఫలమయ్యారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మహిల్ బియర్డ్మన్(3/15), రాఫ్ మెక్మిలన్(3/43) మూడేసి వికెట్లు తీయగా.. కల్లమ్ విడ్లేర్(2/35) రెండు వికెట్లు పడగొట్టాడు. చార్లీ అండర్సన్, టామ్ స్ట్రేకర్ చెరో వికెట్ తీసారు. ఆస్ట్రేలియా సీనియర్ జట్టు ప్రదర్శననే పునరావృతం చేసిన ఆస్ట్రేలియా.. మూడో టైటిల్ను కైవసం చేసుకుంది. రోహిత్ సేన మాదిరే.. కీలక ఫైనల్లో ఉదయ్ సహరణ్ సేన విఫలమైంది.