ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా ఆరు పరాజయాల తర్వాత విజయాన్ని నమోదు చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 51), రజత్ పటీదార్(20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కామెరూన్ గ్రీన్(20 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్)మెరుపులు మెరిపించాడు.

సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/30) మూడు వికెట్లు తీయగా.. టీ నటరాజన్(2/39)రెండు వికెట్లతో సత్తా చాటాడు. ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండేకు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓటమిపాలైంది. అభిషేక్ శర్మ(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31), ప్యాట్ కమిన్స్(15 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 31), షెహ్బాజ్ అహ్మద్(37 బంతుల్లో ఫోర్, సిక్స్తో 40 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, యశ్ దయాల్ తలో వికెట్ పడగొట్టారు.

శుభారంభం లేదు..
207 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. విల్ జాక్స్ వేసిన తొలి ఓవర్లోనే విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్(1) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన ట్రావిస్ హెడ్ మూల్యం చెల్లించుకున్నాడు.
వికెట్ కోల్పోయినా అభిషేక్ శర్మ(31) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. విల్ జాక్స్ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్స్లు, ఫోర్ బాది 20 పరుగులు పిండుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న అతనికి యశ్ దయాల్ కళ్లెం వేసాడు. కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.

దెబ్బతీసిన స్వప్నిల్..
స్వప్పిల్ సింగ్ వేసిన మరుసటి ఓవర్లో సన్రైజర్స్ హైదరాబాద్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అతను వేసిన లడ్డూ లాంటి ఫుల్టాస్కు మార్క్రమ్ ఎల్బీగా వెనుదిరిగాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లాసెన్ ఔటయ్యాడు.
నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ చెరొక సిక్స్ బాది 19 పరుగులు పిండుకున్నా.. రెండు కీలక వికెట్లు తీసి స్వప్నిల్ సింగ్ సన్రైజర్స్ను దెబ్బతీసాడు.
వరుసగా వికెట్లు కోల్పోవడంతో సన్రైజర్స్ హైదరాబాద్ స్కోర్ బోర్డు వేగం తగ్గింది. కర్ణ్ శర్మ బౌలింగ్లో నితీశ్ కుమార్ రెడ్డి(13), అబ్దుల్ సమద్(10) వరుస ఓవర్లలో క్యాచ్ ఔటయ్యారు. దాంతో 10 ఓవర్లలోనే సన్రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయింది.
కమిన్స్ పోరాడినా..
ఈ పరిస్థితుల్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారీ సిక్స్లతో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతని జోరుకు కామెరూన్ గ్రీన్ బ్రేక్ వేసాడు. క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 7వ వికెట్కు నమోదైన 39 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. గ్రీన్ వేసిన మరుసటి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ కూడా క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ.. విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.