పక్కింటి ఆంటీ గొడవ వల్ల తాను క్రికెటర్ను అయ్యానని సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన నితీష్ కుమార్ రెడ్డి తన కెరీర్కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడుతో కలిసి సరదాగా మాట్లాడాడు. క్రికెట్ వైపు ఎలా అడుగులు వేసావు? ఎప్పుడు మొదలు పెట్టావు? అని అంబటి రాయుడు ప్రశ్నించగా.. నితీష్ కుమార్ రెడ్డి ఆసక్తికర సమాధానం చెప్పాడు.

'మా నాన్న జింక్ ఉద్యోగి. జింక్ మైదానంలో నా కెరీర్ మొదలైంది. అయితే వేసవి సెలవుల్లో నేను మా గల్లీ ఫ్రెండ్స్తో బాగా క్రికెట్ ఆడేవాడిని. మా పక్కింటి ఆంటీకి మా అమ్మకు పడేది కాదు. నేను మాత్రం ఆ ఆంటీ వాళ్ల ఇంట్లోకి తరుచూ బంతి కొట్టేవాడిని. దాంతో ఆ ఆంటీ మా అమ్మతో ఎప్పుడూ గొడవ పెట్టుకునేది.
మా అమ్మ నాపై చాలా సీరియస్ అయ్యి.. సమ్మర్ హాలీడేస్లో వీడు ఏం చేయడం లేదు. గ్రౌండ్కు తీసుకెళ్లండని మా నాన్నకు చెప్పింది. మా నాన్న కూడా కబడ్డీ ప్లేయర్. ఆయన రోజు గ్రౌండ్కు వెళ్లేవాడు. ఇక నా ఆట చూసిన కోచ్.. బాగా ఆడుతున్నాడని, కోచింగ్ ఇప్పిస్తే మంచి క్రికెటర్ అవుతాడని నాన్నకు చెప్పాడు. దాంతో నన్ను నమ్మిన మా నాన్న కోచింగ్ ఇప్పించాడు. అలా నా కెరీర్ ప్రారంభమైంది.'అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.
నా రోల్ మోడల్ కోహ్లీ..
ఇక తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ అని, అతని బ్యాటింగ్, అటిట్యూడ్ అంటే చాలా ఇష్టమని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. 'నా రోల్ మోడల్ విరాట్ కోహ్లీ. అతని బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. దానికన్న ఎక్కువ అతని అటిట్యూట్ నాకు చాలా ఇష్టం. మైదానంలో దూకుడుగా ఉండే తీరు బాగా నచ్చుతుంది.
చాలా మంది ఇలా ఉండరు. అలా ఉంటే ఏం జరుగుతుందోనని భయపడుతారు. కానీ విరాట్ ఎప్పుడూ భయపడడు. తన దూకుడుతో ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తెస్తాడు. అందుకే నాకు ఆ అటిట్యూడ్ అంటే చాలా ఇష్టం.'అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.