మూడు టీ20 సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక చివరి మ్యాచ్లో భారత మహిళల జట్టు పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. రిచా ఘోష్ (28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34) మెరుపులు మెరిపించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది.
ఓపెనర్లు షెఫాలీ వర్మ(17 బంతుల్లో 6 ఫోర్లతో 26), స్మృతి మంధాన(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జార్జియో వేర్హమ్(2/24), అన్నబెల్ సదర్లాండ్(2/12) రెండేసి వికెట్లు తీయగా.. అష్లే గార్డనర్, మేఘన్ స్కట్ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన ఓపెనర్లు వేగంగా పరుగులు రాబట్టారు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని మేఘన స్కట్ విడదీసింది. షెఫాలీ వర్మ(26)ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చింది. దాంతో తొలి వికెట్కు నమోదైన 39 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి జెమీమా రాగా.. మంధాన ధాటిగా ఆడింది. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.
అనంతరం జెమీమా(2)ను సదర్లాండ్ ఔట్ చేయగా.. నిలకడగా ఆడుతున్న స్మృతి మంధాన(29)ను వార్హమ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(3) తన వైఫల్యాన్ని కొనసాగించగా.. దీప్తి శర్మతో కలిసి రిచా ఘోష్ జట్టును ఆదుకుంది. దీప్తి శర్మ వెనుదిరిగినా.. ధాటిగా ఆడిన రిచా ఘోష్.. చివరి ఓవర్లో గార్డ్నర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. అమన్ జోత్ కౌర్ రెండు బౌండరీలు బాదడంతో టీమిండియా 147 పరుగులు చేయగలిగింది.
ఈ సిరీస్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవగా.. ఇది డిసైడర్గా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుంది.