టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్కు మళ్లీ నిరాశే ఎదురుకానుంది. సుదీర్ఘ కాలంగా భారత జట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్న ఈ కేరళ బ్యాటర్కు సెలెక్టర్లు మరోసారి మొండి చెయ్యే చూపించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా సంజూ శాంసన్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన సంజూ శాంసన్ 62.80 యావరేజ్ 152.43 స్ట్రైక్రేట్తో 314 రన్స్ చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో సంజూ శాంసన్కు టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. కనీసం రెండో వికెట్ కీపర్గా అయినా అతన్ని తీసుకుంటారని భావించారు.

దుమ్మురేపుతున్న పంత్..
కానీ రిషభ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్తో భారత ప్రధాన వికెట్ కీపర్ స్లాట్ లాగేసుకున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదంతో 15 నెలల పాటు ఆటకు దూరమైన పంత్.. ఈ సీజన్తోనే రీఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా 9 మ్యాచ్ల్లో 48.86 సగటు, 161.32 స్ట్రైక్రేట్తో 342 రన్స్ చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ ప్రదర్శనతో రిషభ్ పంత్ ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే శక్తి కలిగి ఉండటం.. లెఫ్టాండర్ కావడం.. ఫినిషర్గా ఆడటం అతనికి కలిసొచ్చే అంశాలు.

రాహుల్తో సంజూకు పోటీ..
రెండో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా 8 మ్యాచ్ల్లో 37.75 సగటు, 141.12 స్ట్రైక్రేట్తో 302 రన్స్ చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సంజూ శాంసన్ కంటే రాహుల్ రికార్డులు మెరుగ్గా లేకున్నా.. అతను లోయర్ మిడిలార్డర్లో ఆడే అవకాశం ఉండటంతో పాటు అనుభవం ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం.
టీ20 ప్రపంచకప్ బరిలో దిగే భారత జట్టు ఎంపికపై అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఓ అంచనాకు వచ్చినట్లు ప్రముఖ వార్త ఏజెన్సీ పేర్కొంది. టీమిండియా సెకండ్ వికెట్ కీపర్గా సంజూ శాంసన్ కంటే కేఎల్ రాహుల్ను తీసుకునేందుకు సెలెక్టర్లు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ముగ్గురు బౌలర్ల మధ్య పోటీ..
బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తమ బెర్త్లను కన్ఫామ్ చేసుకోగా.. మరో స్థానం కోసం రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ పోటీపడుతున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా ఫామ్ను కూడా సెలెక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతనికి ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడంతో హార్దిక్కు ఇబ్బంది లేకుండా పోయింది.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఢిల్లీ వేదికగా సెలెక్టర్లు, టీమ్మేనేజ్మెంట్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హాజరుకానున్నాడు. ప్రస్తుతం అతను ఢిల్లీలోనే ఉన్నాడు.
ప్రపంచకప్ బరిలోకి దిగే జట్లను ప్రకటించేందుకు ఐసీసీ మే 1 డెడ్లైన్గా విధించింది. ఈ క్రమంలోనే ఈ వారం చివర్లో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.