ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్లో టీమిండియా మహిళల జట్టు శుభారంభం చేసింది. ముంబై వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో పర్యాటక ఆసీస్ను చిత్తు చేసింది. బౌలింగ్ టిటాస్ సాధు(4/17) రఫ్ఫాడించగా.. బ్యాటింగ్లో స్మృతి మంధాన(52 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 54), షేఫాలీ వర్మ(44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 64) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 141 పరుగులకు కుప్పకూలింది. ఫోబె లిట్చిఫీల్డ్(49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ఎల్లిస్ పెర్రీ(37) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో టిటాస్ సధు(4/17) నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. శ్రేయాంక పాటిల్(2/19), దీప్తి శర్మ(2/24) రెండేసి వికెట్లు తీసారు. రేణుకా సింగ్, అమన్జోత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 17.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి గెలుపొందింది. విజయానికి 8 పరుగుల దూరంలో స్మృతి మంధానను జార్జియో వార్హమ్ ఔట్ చేయగా.. జెమీమా రోడ్రిగ్స్(6 నాటౌట్) సాయంతో షెఫాలీ వర్మ విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.
స్వల్ప లక్ష్య చేధనకు దిగిన భారత్కు తొలి ఓవర్లోనే అప్పనంగా 14 పరుగులు లభించాయి. డార్సీ బ్రౌన్ వేసిన ఈ ఓవర్లో 14 ఎక్స్ట్రాలు వచ్చాయి. ఈ ఓవర్ మొత్తం ఆడిన స్మృతి మంధాన ఖాతా తెరవకపోగా.. లెగ్ బైస్ రూపంలో మూడో బౌండరీలతో పాటు ఒక సింగిల్ వచ్చింది. ఒక నోబాల్ వేయడంతో మొత్తం 14 పరుగులు అప్పనంగా భారత్ ఖాతాలో చేరాయి.
ఈ అనూహ్య ఆరంభంతో చెలరేగిన భారత ఓపెనర్లు.. ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా షెషాలీ వర్మ 3 సిక్స్లతో ఆసీస్ బౌలర్లను భయపెట్టింది. ఈ క్రమంలో షెఫాలీ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్మృతి మంధాన 50 బంతుల్లో అర్థ శతకాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్లోనే స్మృతి మంధాన టీ20ల్లో 3వేల పరుగుల మైలు రాయి అందుకుంది. ఈ ఘనత సాధించిన ఆరో బ్యాటర్గా చరిత్రకెక్కింది. ఇక షెఫాలీ వర్మ, స్మృతి మంధాన తొలి వికెట్కు 137 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.