న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదాపడటంతో 10 రోజుల పాటు ఢిల్లీలో ఉండి, ఆ తర్వాత వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ కోసం ఇంగ్లండ్కు బయల్దేరాలని భావించిన ముగ్గురు న్యూజిలాండ్ ఆటగాళ్లు మనసు మార్చుకున్నారు. న్యూజిలాండ్ కెప్టెన్, సన్రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్తో పాటు ఆర్సీబీ, సీఎస్కే ప్లేయర్స్ అయిన కైల్ జేమీసన్, సాంట్నర్ కివీస్ సహాయ సిబ్బందిలో ఒకరైన సీఎస్కే ఫిజియో టామీ సింసెక్ ఆస్ట్రేలియా ఆటగాళ్ల మాదిరి మాల్దీవులకు వెళ్లిపోయారు. కోవిడ్ హాట్ స్పాట్గా మారిన ఢిల్లీలో ఉండలేకపోయారు. తమ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మినీ బయో బబుల్ను కాదనుకొని శుక్రవారమే కమర్షియల్ ఫ్లైట్లో మాల్దీవ్స్కు పయనమయ్యారు.
వాస్తవానికి ఈ నలుగురూ ఈ నెల 10వ తేదీ వరకూ ఢిల్లీలో ఉండి 11న ప్రత్యేక విమానంలో యూకే వెళ్లాల్సి ఉంది. కరోనా ఉధృతి నేపథ్యంలో తమ ప్లేయర్ల భద్రతా దృష్ట్యా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు(ఎన్జెడ్సీ) ఢిల్లీలో వీరి కోసం మినీ బయో బబుల్ ఏర్పాట్లు చేయించింది. కానీ ఢిల్లీలో రెండు రోజులు గడిపాక కరోనా తీవ్రత దృష్ట్యా ఇక్కడ ఉండటం సురక్షితం కాదని భావించిన ఈ నలుగురూ మాల్దీవుల విమానం ఎక్కేసినట్లు సన్రైజర్స్ అధికారి ఒకరు వెల్లడించారు. కొన్ని రోజులు మాల్దీవుల్లో గడిపాక అక్కడి నుంచి వీరంతా లండన్కు చేరుకోనున్నారు. కాగా, కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తన ఫ్యామిలీని చూసేందుకు స్వదేశం వెళ్లిపోయాడు. ఐపీఎల్లో ఆడిన మిగతా ప్లేయర్ల కోసం ఏర్పాట్లు చేసిన చార్టెడ్ ఫ్లైట్ ఎక్కాడు.