ఏబీ డివిలియర్స్.. పరిచయం అక్కర్లేని పేరు. విధ్వంసకరమైన ఆటకు మారు పేరు అతను. మైదానం నలు మూలలు షాట్లు బాదగల సమర్థుడు. మిస్టర్ 360గా అభిమానుల నీరాజనాలు అందుకున్న ఆటగాడు. సౌతాఫ్రికా ప్లేయర్ అయినా.. భారత ప్రజల మన్ననలు పొందిన ప్లేయర్. తన విధ్వంసకర ఆటతో ఐపీఎల్లోనే తనదైన ముద్ర వేసాడు.
అలాంటి ఆటగాడు భీకర ఫామ్లో ఉన్నప్పుడే 34 ఏళ్ల వయసులో ఆకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.2018లో అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన అతను 2021 వరకు ఐపీఎల్ ఆడాడు. అయితే తన కొడుకు కారణంగానే అంతర్జాతీయ క్రికెట్కు త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని ఏబీ డివిలియర్స్ తాజాగా వెల్లడించాడు.

ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆకస్మిక రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించాడు. చూపు మందగించడంతోనే ఆటకు వీడ్కోలు పలికానని చెప్పాడు.
'ఒక రోజు మా చిన్న అబ్బాయి పాదం నా కంటికి బలంగా తాకింది. అప్పటి నుంచే నా కుడి కంటి చూపు నెమ్మదిగా తగ్గడం మొదలైంది. సర్జరీ కూడా అవసరమైంది. ఇలాంటి కంటితో ఇన్నాళ్లు ఎలా ఆడావు? అని డాక్టర్ కూడా షాకయ్యాడు. కానీ అదృష్టం కొద్దీ కెరీర్ చివర్లో నా ఎడమ కంటికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.'అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
గాయం అయితన తర్వాత తన కుడి కన్ను చాలా మబ్బుగా కనిపించేదని, ఐపీఎల్లో స్కోర్ బోర్డులను చూస్తూ కంటి చూపును పరీక్షించుకునేవాడినని డివిలియర్స్ తెలిపాడు. 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయం తనపై తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. కోవిడ్ 19 సమయంలోనూ తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇక సౌతాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్లు ఆడిన ఏబీ డివిలియర్స్... టెస్టుల్లో 8,765 , వన్డేల్లో 9577, టీ20ల్లో 1672 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఆర్సీబీ, ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున 184 మ్యాచులు ఆడిన ఏబీడీ.. 5,162 రన్స్ చేశాడు.