Bharat Arun: టాసే టీమిండియా కొంప ముంచింది.. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ మధ్య చిన్న బ్రేక్ ఉండాల్సింది!

దుబాయ్: టీ20 ప్రపంచకప్లో టీమిండియా వైఫల్యానికి టాస్ ఓడిపోవడమే ప్రధాన కారణమని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. టాసే మ్యాచ్ ఫలితాన్ని శాసించిందని, తేమ ప్రభావం కారణంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకే పూర్తిగా అడ్వాంటేజ్గా మారిందన్నాడు. టీ20 ఫార్మాట్లో టాస్కు ఇంత ప్రాధాన్యత ఉండటం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. ఇక తీరిక లేని షెడ్యూల్, బయో బబుల్స్ కూడా ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపిందన్నాడు.
ఐపీఎల్ 2021 సీజన్, టీ20 ప్రపంచకప్ మధ్య ఓ చిన్న బ్రేక్ ఉంటే బాగుండేదన్నాడు. టోర్నీలో భాగంగా నమీబియాతో సోమవారం జరగనున్న ఆఖరి లీగ్ మ్యాచ్ నేపథ్యంలో భరత్ అరుణ్ మీడియాతో మాట్లాడాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్.. లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితులపై భరత్ అరుణ్ స్పందించాడు.

చిన్న బ్రేక్ ఉండాల్సింది..
'గత ఆరు నెలలుగా భారత ఆటగాళ్లు బిజీగానే ఉన్నారు. కనీసం వాళ్ల ఇళ్లకు కూడా వెళ్లలేదు. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడ్డప్పుడే చిన్న బ్రేక్ దొరికింది. ఆ తర్వాతి నుంచి సుమారు 6 నెలలుగా బయో బబుల్లోనే ఉంటున్నారు. అది ఆటగాళ్ల మానిసిక స్థితిపై ప్రభావం చూపించిందనుకుంటా. ఐపీఎల్, ప్రపంచకప్ మధ్య ఓ చిన్న బ్రేక్ ఉంటే ఆటగాళ్లు రిఫ్రెష్ అయ్యేవారు.
ఇక టాస్ మా పతనాన్ని శాసించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ తరహా మ్యాచ్లో టాస్కు ఇంత ప్రాధాన్యత లభించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. టాస్ గెలిచిన జట్టుకు అన్ఫెయిర్ అడ్వాంటేజ్ లభించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఉన్న పరిస్థితులు తర్వాత బ్యాటింగ్ చేసేటప్పుడూ పూర్తిగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితులు టీ20 ఫార్మాట్లో ఉండటం మంచిది కాదు'అని భరత్ అరుణ్ చెప్పుకొచ్చాడు.

అది సెలెక్టర్ల పని..
ఇక యుజ్వేంద్ర చాహల్ను జట్టులోకి తీసుకోకుండా తప్పిదం చేశారా? అని ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు భరత్ అరుణ్ నిరాకరించాడు. సెలెక్టర్లు తమకు ఇచ్చిన జట్టుతో ఆడించడమే తమ పనని తెలిపాడు. 'టీమ్ సెలెక్షన్పై నేను మాట్లాడలేను. అది సెలెక్టర్ల పని. మాకిచ్చిన టీమ్ ఆడటమే మా బాధ్యత'అని భరత్ అరుణ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ టీ20 ప్రపంచకప్తో హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పదవి కాలం ముగియనుంది. ఇప్పటికే భారత కొత్త కోచ్గా రాహుల్ ద్రవిడ్ను నియమించిన బీసీసీఐ.. సపోర్టింగ్ స్టాఫ్ను ఎంపిక చేసే పనిలో పడింది.

భారత్ ఔట్..
ఇక టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అధికారికంగా నిష్క్రమించింది. అఫ్గానిస్థాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించడంతో భారత్కు అవకాశం లేకుండా పోయింది. 8 పాయింట్లతో రన్రేట్తో సంబంధం లేకుండా న్యూజిలాండ్ సగర్వంగా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఇక నమీబియాతో భారత్ నామమాత్రపు మ్యాచ్ ఆడి స్వదేశం రానుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రికి ఈ టోర్నీ కెరీర్లోనే ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఈ టోర్నీ అనంతరం విరాట్ కోహ్లీ కూడా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications