
చెన్నై: జట్టులో స్థానం కోసం ఆందోళన చెందొద్దంటూ మహేంద్రసింగ్ ధోనీ ఇచ్చిన భరోసా తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని టీమిండియా యువ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. గతేడాదే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన రుతురాజ్.. సీజన్ ఫస్టాఫ్లో పెద్దగా రాణించలేకపోయాడు. కరోనాతో చాలా రోజులు బయో బబుల్లో ఉన్న ఈ యువ ఆటగాడు ఆరంభ మ్యాచ్ల్లో తడబడ్డాడు.
ఈ స్థితిలో ధోనీ తనతో మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చాడని తాజాగా రుతురాజ్ చెప్పుకొచ్చాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 సీజన్లో దుమ్మురేపిన రుతురాజ్.. 16 మ్యాచ్ల్లో 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ప్రదర్శనతో భారత్ వేదికగా రేపటి(బుధవారం) నుంచి జరిగే మూడు టీ20ల సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన రుతురాజ్.. తన సక్సెస్కు ధోనీనే కారణమని వెల్లడించాడు. 'గత సీజన్లో లీగ్ దశలోనే చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
స్వల్ప స్కోర్లకే ఔటయ్యా. 'జట్టులో స్థానం గురించి ఆందోళన చెందొద్దు' అని ధోనీ అన్న మాటలు స్థైర్యాన్ని నింపాయి. నాపై కెప్టెన్, ఫ్రాంఛైజీ పెట్టుకున్న నమ్మకం ఏంటో అర్థమైంది. మహి భాయ్ నా వెనుక ఉన్నాడన్న ధైర్యం నన్ను శాంతపరిచింది. అప్పటి నుంచి స్వేచ్ఛగా ఆడడం మొదలుపెట్టాను. అందుకే తాజా ఐపీఎల్ టోర్నీలో నేనేంటో నిరూపించుకోగలిగా. ఆరెంజ్ క్యాప్ అందుకుంటానని అనుకోలేదు'' అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.