|
విజయోత్సవాల కోసం..
ఈ దఫా ఛాంపియన్గా ఆవిర్భవించినందున చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఫ్రాంఛైజీ- విజయోత్సవాలను నిర్వహించింది. చెన్నై వాలాజపేట్టై రోడ్లో గల కళైవనార్ ఆరంగం ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎస్కే కేప్టెన్ ధోనీ, భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ కపిల్ దేవ్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జయ్ షా, సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్ ఇందులో పాల్గొన్నారు. 2010, 2011, 2018, 2021 ఐపీఎల్ సీజన్లు సీఎస్కే ఖాతాలో పడ్డాయి.
స్టాలిన్ పేరుతో జెర్సీ నంబర్ 7
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేరుతో ప్రత్యేకంగా జెర్సీ నంబర్ 7ను రూపొందించింది ఫ్రాంఛైజీ. దీన్ని స్టాలిన్, ధోనీ కలిసి సంయుక్తంగా ఆవిష్కరించారు. తన పేరు మీద జెర్సీని రూపొందించడం పట్ల స్టాలిన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫ్రాంఛైజీ ఓనర్ శ్రీనివాసన్, ధోనీకి కృతజ్ఞతలు తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్.. తన పేరును నిలబెట్టుకుందంటూ ప్రశంసించారు. ఇదే జైత్రయాత్రను కొనసాగించాలని అకాంక్షించారు. క్రికెట్ సహా ఇతర క్రీడలను అభివృద్ధి చేయడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు.
|
రిటైర్మెంట్ గురించి..
ఈ సందర్భంగా ధోనీ మాట్లాడారు. తన రిటైర్మెంట్ గురించి మరోసారి ప్రస్తావించారు. తాను ఎప్పుడు రిటైర్ అవుతానో తనకు తెలియదని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం రిటైర్ అవుతానా? లేక అయిదేళ్ల తరువాత వీడ్కోలు పలుకుతానా? అనేది తనకే క్లారిటీ లేదని వ్యాఖ్యానించారు. ఎప్పుడు రిటైర్ అయినా సరే.. చివరి టీ20ని మాత్రం చెన్నైలోనే ఆడతానంటూ ధోనీ కుండబద్దలు కొట్టారు. ఇదివరకు కూడా అతను ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
హోమ్ టౌన్లో చివరి వన్డే
తన హోమ్ టౌన్ రాంచీలో చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ను ఆడానని ధోనీ గుర్తు చేసుకున్నారు. తాను అలా ప్లాన్ చేసుకున్నానని స్పష్టం చేశారు. అదే తరహాలో ఐపీఎల్లో చివరి టీ20 మ్యాచ్ను చెన్నైలోనే ఆడేలా ప్లాన్ చేసుకుంటానని, అది ఎప్పుడనేది తనకు తెలియదని తేల్చి చెప్పారు. తన తల్లిదండ్రుల స్వరాష్ట్ర ఉత్తరాఖండ్ అని, వృత్తిరీత్యా వారు రాంచీలో స్థిరపడ్డారని అన్నారు. రాంచీలో తాను పుట్టి పెరిగానని, ఉద్యోగం చేయడానికి పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్కు వెళ్లానని అన్నారు. ఆయా నగరాలతో తనకు అనుబంధం ఉందని పేర్కొన్నారు.
చెన్నైతో అంతకంటే..
ఆయా నగరాల కంటే చెన్నైతో తనకు ఇంకా అనుబంధం ఎక్కువగా ఉందని ధోనీ వ్యాఖ్యానించారు. తన కేరీర్లో తొలి టెస్ట్ మ్యాచ్ను చెన్నైలోనే ఆడానని, 2008 నుంచీ చెన్నై సూపర్ కింగ్స్తో కొనసాగుతున్నానని, ఇదో మరపురాని ప్రయాణమని అన్నారు. ఐపీఎల్ 2020 సీజన్లో చెన్నైను కనీసం ప్లేఆఫ్స్కు కూడా చేర్చలేకపోవడం బాధను మిగిలిందని చెప్పుకొచ్చారు. ఆ పరాజయం.. ఫ్రాంఛైజీని మరింత బలోపేతం చేసుకోవడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు.