హైదరాబాద్: కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన లడఖ్కు చెందిన క్రికెటర్లు ఇక నుంచి జమ్ము కశ్మీర్ రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీలో పాల్గొనవచ్చని సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ (సీఓఏ) వినోద్ రాయ్ తెలిపారు.
సోమవారం కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ.. జుమ్ము కశ్మీర్, లడఖ్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
లార్డ్స్ టెస్టుకు జిమ్మీ దూరం: ఇంగ్లాండ్కు ఊహించని షాక్ తగిలింది
మరోవైపు లడఖ్కు ప్రత్యేకమైన క్రికెట్ బోర్డు అంటూ ఏమీ ఉండదని సీఓఏ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ మాట్లాడుతూ "లడఖ్కు ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన ఏమీ లేదు. ఆ ప్రాంతానికి చెందిన ఆటగాళ్లు బీసీసీఐ నిర్వహించే ప్రతి దేశవాలీ పోటీల్లో జమ్ము కశ్మీర్ తరఫున పాల్గొనవచ్చు" అని అన్నారు.
అయితే, లడఖ్కు చెందిన ఏ ఒక్క ఆటగాడు కూడా ఇప్పటివరకు జమ్ము కశ్మీర్ తరుపున రంజీల్లో ఆడలేదు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభంకానున్న రంజీ సీజన్లో లద్ధాఖ్ ఆటగాళ్లు జమ్ము కశ్మీర్ తరఫున ఆడే అవకాశం ఇప్పుడు కల్పించారు. ఇక, పుదుచ్చేరి మాదిరి లడఖ్ బీసీసీఐ ఓటింగ్ మెంబర్ కాదని కూడా వినోద్ రాయ్ తేల్చి చెప్పారు.
టీ20ల్లో అరుదైన రికార్డుకి చేరువలో శిఖర్ ధావన్!
"ఓటింగ్ మెంబర్ అంశంపై ప్రస్తుతం చర్చించలేదు. చండీగఢ్ ఆటగాళ్లు అటు పంజాబ్ తరఫున, ఇటు హర్యానా తరఫున ఆడుతున్నారు. చండీగఢ్లా ఆ ప్రాంతానికి కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. గతేడాది మాదిరే జమ్ము కశ్మీర్ హోం గేమ్స్ శ్రీనగర్లోనే జరుగుతాయి. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ హోం వేదికపై చర్చ జరగలేదు. ఇకముందు కూడా ఏమీ మారదు" అని వినోద్ రాయ్ అన్నారు.
మనసు, గుండె ఇప్పటికీ కాశ్మీర్లోనే: ఇర్ఫాన్ పఠాన్
కాగా, కొన్ని రోజుల క్రితం జమ్ము కశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని ఇర్ఫాన్ పఠాన్తోపాటు మరో 100 మంది క్రికెటర్లకు జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) సూచించిన సంగతి తెలిసిందే. ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుతం జమ్ము అండ్ కాశ్మీర్ జట్టు క్రీడాకారుడిగా, మెంటర్గా వ్యవహరిస్తున్నారు.
ఇర్ఫాన్ పఠాన్ స్వస్థలం గుజరాత్. దీంతో ఇర్ఫాన్ పఠాన్తో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు సేవలందిస్తోన్న మిగతా రాష్ట్రయేతరులను అందరినీ రాష్ట్రం విడిచి వెళ్లాలని జేకేసీఏ సూచించింది. ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో పాటు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది.