ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ తుది దశకు చేరింది. మరో మూడు నాకౌట్ మ్యాచ్లతో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరాయి. బుధవారం(మార్చి 4) కోల్కతా వేదికగా న్యూజిలాండ్ X సౌతాఫ్రికా మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్, గురువారం(మార్చి 5) ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.
అయితే ఈ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగిస్తే పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్లకు వర్షం ముప్పు లేకున్నా.. మ్యాచ్ సమయానికి వర్షంతో మ్యాచ్ జరగకపోతే ఏం చేస్తారు? అనే ప్రశ్నలు సగటు అభిమానులను వేధిస్తున్నాయి.

అయితే ఈ మ్యాచ్లకు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. ముందు రోజు మ్యాచ్ జరగకపోతే.. మరుసటి రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. ముందు రోజు ఆగిపోయిన దగ్గర్నుంచే రెండో రోజు ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే కూడా మ్యాచ్ సాధ్యం కాక వర్షంతో మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతే..ఏం చేస్తారనేది కీలకంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఫలితం తేల్చే విధానంపైన ఐసీసీ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం, నాకౌట్ దశలో మ్యాచ్ ఫలితం రాకపోతే, సూపర్-8 దశలో అన్ని మ్యాచులు పూర్తయిన తరువాత సెమీస్ లో పోటీ పడిన రెండు జట్లలో మెరుగైన స్థానాల్లో ఉన్న జట్టే ఫైనల్కు అర్హత సాధిస్తుంది.

సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షంతో రద్దయితే సౌతాఫ్రికా ముందడుగు వేయనుండగా.. న్యూజిలాండ్ ఇంటిబాటపడుతోంది. గ్రూప్-1లో సౌతాఫ్రికా టాపర్గా నిలవగా.. గ్రూప్-2లో న్యూజిలాండ్ రన్నరప్గా నిలిచింది.
భారత్ X ఇంగ్లండ్ మ్యాచ్ రద్దయితే ఇంగ్లండ్ ఫైనల్ చేరుతుంది. ఎందుకంటే గ్రూప్-2లో ఇంగ్లండ్ టాప్లో నిలవగా.. గ్రూప్-1లో భారత్ రన్నరప్గా సెమీస్ చేరింది. అప్పుడు భారత్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించవద్దని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
