ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మకు బ్రేక్ ఇవ్వాలని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగే ఫైనల్లో అభిషేక్ శర్మకు బదులు రింకూ సింగ్ను ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు.
ఈ మెగా టోర్నీలో అభిషేక్ శర్మ అంచనాలను అందుకోలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్ అయిన అతను.. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ బాదినా ఆ జోరును కొనసాగించలేకపోయాడు. వెస్టిండీస్తో పాటు ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో తీవ్రంగా నిరాశపర్చాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మను తుది జట్టు నుంచి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఫైనల్ ముంగిట టీమిండియా కాంబినేషన్ గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్.. అభిషేక్ శర్మను పక్కనపెట్టాలని అభిప్రాయపడ్డాడు. 'అభిషేక్ శర్మకు కాస్త విరామం ఇవ్వవచ్చు. అతను ఇప్పటికే చాలా మ్యాచ్లు ఆడాడు. జట్టులో మార్పులు చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో ఇలాంటి మార్పులు సహజం.
బ్రాండన్ కింగ్ ఫామ్లో లేనప్పుడు వెస్టిండీస్ రోస్టన్ ఛేజ్ను ఓపెనర్గా ఆడించింది. వారు అతనికి ఐదు, ఆరు మ్యాచ్లు అవకాశం ఇచ్చారు. కానీ ఒక పెద్ద మ్యాచ్ కోసం అతనికి విరామం ఇచ్చారు. భారత్ కూడా సంజూను జట్టులోకి తీసుకొచ్చి ఫలితాన్ని రాబట్టింది. సంజూ అద్భుతంగా రాణించాడు.

భారత జట్టులో ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. రింకూ సింగ్ టెస్టు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్ ఎక్కడైనా పరుగులు చేస్తాడు. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్లకు కూడా వికెట్లు తీసే సత్తా ఉంది. అభిషేక్ శర్మ స్థానంలో ఎవరిని తీసుకోవాలని డగౌట్ వైపు చూస్తే.. రింకూ సింగ్ సరైనవాడు అనిపిస్తోంది. కాబట్టి అతన్ని జట్టులోకి తీసుకోండి. ఒక ఆటగాడు పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నప్పుడు.. ప్రతిభ కలిగిన మరో ఆటగాడు బెంచ్పై కూర్చోవడం సరికాదు.
వరుణ్ చక్రవర్తి కూడా ఈ టీ20 వరల్డ్ కప్లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. కానీ వరుణ్ను జట్టు నుంచి తీసేయరని నేను అనుకుంటున్నా. అతని బౌలింగ్పై మాత్రం వారు దృష్టి సారిస్తారు. వచ్చే మ్యాచ్లో అతను తన లైన్ అండ్ లెంగ్త్ను మార్చుకునే అవకాశం ఉంది.
అభిషేక్ శర్మను సంజూ శాంసన్తో పోల్చడంపై సరికాదు. అభిషేక్ శర్మ కంటే సంజూ శాంసన్కు టీ20ల్లో అపారమైన అనుభవం ఉంది. ఐసీసీ టోర్నీలకు అభిషేక్ శర్మ కొత్త. ఐసీసీ టోర్నీలను మినహాయిస్తే అభిషేక్ శర్మ అద్భుతమైన రికార్డ్ ఉంది. కానీ ఐసీసీ టోర్నీ, వరల్డ్ కప్ ఆడటం అనేది చాలా భిన్నమైన విషయం.
సంజూ టీ20ల్లో 8000కు పైగా పరుగులు చేశాడు. పరుగులు సాధించడంలో.. సిక్సర్లు కొట్టడంలో అతని పేరు ఐపీఎల్లో టాప్ 10లో ఉంటుంది. అతను ఇప్పటికే సెటిల్ అయిన ఆటగాడు. అభిషేక్ శర్మ ఇంకా యువ ఆటగాడు. తన ఆటపై మరింత శ్రమించాల్సి ఉంది. అతను ఇంకా పూర్తిస్థాయిలో రాటుదేలలేదు. కాబట్టి అతన్ని సంజూతో పోల్చడం సరికాదు. సంజూ ఇప్పటికే ఒక పరిపూర్ణమైన ఆటగాడు. అతను 11 ఏళ్ల క్రితమే టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు.'అని కైఫ్ వివరించారు.
