ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన అక్కసును వెళ్లగక్కాడు. భారత విజయాన్ని జిర్ణీంచుకోలేకపోయిన అక్తర్.. తన నోటికి పనిచెప్పాడు. తమ దగ్గరున్న డబ్బులతో ఆధిపత్యం చెలాయిస్తూ.. క్రికెట్ను భారత్ నాశనం చేస్తోందని ఆరోపించాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేయగా.. న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో టీమిండియా మూడో టీ20 ప్రపంచకప్ను ముద్దాడటంతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్గా టైటిల్ నిలబెట్టుకున్న జట్టుగా.. సొంతగడ్డపై ట్రోఫీ గెలిచిన టీమ్గా చరిత్ర సృష్టించింది. భారత విజయంపై ఓ టీవీ ఛానెల్లో మాట్లాడిన షోయబ్ అక్తర్.. మిశ్రమ వ్యాఖ్యలు చేశాడు. ఓ వైపు భారత విధానాలను కొనియాడుతూనే.. మరోవైపు తమ ఆధిపత్యంతో క్రికెట్ను నాశనం చేసిందని ఆరోపించాడు. భారత జట్టును ధనిక పిల్లాడితో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

'పక్కదేశంలో ఒక ధనిక పిల్లాడు పేద పిల్లలందరినీ పిలిచి రండీ క్రికెట్ ఆడుదాం అంటాడు. ముందుగా 8 జట్లలో నాలుగు జట్లను ఉంచుకొని, తర్వాత అందులో మూడు జట్లను ఇంటికి పంపించి చివరకు నేనే గెలిచాను అంటాడు. ఇప్పుడు భారత్ మనతో చేస్తున్నది కూడా ఇదే. భారత్ క్రికెట్ను పూర్తిగా నాశనం చేసింది.'అని అక్తర్ తన అక్కసును వెళ్లగక్కాడు. డబ్బు పలుకుబడితో టోర్నీని తమకు అనుకూలంగా మార్చుకొని విజేతగా నిలిచిందని అక్షర్ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.
ఇదే ఇంటర్వ్యూలో భారత్ సాధించిన ఈ విజయం వెనుక ఉన్న పటిష్టమైన విధానాలు ఉన్నాయని ప్రశంసించాడు. 'ముందు భారత్ పాలసీ గెలిచింది. తర్వాత వారి సిస్టమ్ గెలిచింది. అన్నింటికంటే ముఖ్యంగా వారి ప్రతిభ గెలిచింది'అని కొనియాడాడు. భారత్ సరైన చోట డబ్బును పెట్టుబడిగా పెడుతోందని, స్టేడియాలు, బయోమెకానికల్ ల్యాబ్స్, శిక్షణ కేంద్రాలపై చేస్తున్న ఖర్చు ఈ ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నాడు. ఫామ్ లేకపోయినా.. విమర్శలు వచ్చినా సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను గంభీర్ నమ్మి జట్టులో కొనసాగించాడని, అతని నమ్మకమే జట్టును విజేతగా నిలిపిందన్నాడు. ఫైనల్లో సంజూ శాంసన్ ఒక్కడే ప్రత్యర్థి జట్టును నిర్వీర్యం చేశాడని ప్రశంసించాడు.
భారత క్రికెట్లో సీనియర్ ఆటగాళ్లు గౌరవం దక్కుతుందని, ఫైనల్కు ముగ్గురు దిగ్గజ కెప్టెన్లు రోహిత్, ధోనీ, కపిల్ దేవ్లను ఆహ్వానించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. ఫైనల్కు ముందు న్యూజిలాండ్ గెలవాలని కోరుకున్న అక్తర్.. భారత్ విజయం తర్వాత వారి ఆధిపత్యంపై విమర్శలు గుప్పిస్తూనే.. పటిష్టమైన క్రికెట్ వ్యవస్థను కొనియాడాడు.