ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం సోషల్ మీడియా వేదికగా నకిలీ వార్తలు హల్ఛల్ చేస్తున్నాయి. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు సృష్టించేలా కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్ ముందు ఓ మీడియా ప్రతినిధి కోహ్లీ పేరును ప్రస్తావించగా.. టీమిండియా కోచ్ తీవ్ర అసహనానికి గురయ్యాడనే ఓ ఫేక్ కథనాన్ని కొందరు ఆకతాయిలు సృష్టించారు. ఇదే నిజమేనని భావించిన నెటిజన్లు ఈ ఫేక్ పోస్ట్లను వైరల్ చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఇది నిజమేనని భావించి వార్తలు రాసి అభిమానులను తప్పుదోవ పట్టిస్తున్నాయి.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ప్రపంచకప్ విజయానంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. టోర్నీ, జట్టుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అయితే ఈ సమావేశంలో ఓ జర్నలిస్ట్ విరాట్ కోహ్లీ ప్రస్తావన తీసుకు రాగా.. గంభీర్ అసహనం వ్యక్తం చేశాడని ఓ ఫేక్ కథనాన్ని సోషల్ మీడియా వేదికగా సృష్టించారు.
ఆ ఫేక్ స్టోరీ ఏంటంటే.. సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్లో విరాట్ కోహ్లీని మిస్ అయ్యారా? అని సదరు జర్నలిస్ట్ గంభీర్ను ప్రశ్నించాడట. దానికి 'కోహ్లీని అస్సలు మిస్సవ్వలేదు. ఒక్క శాతం కూడా మిస్ కాలేదు. ప్రస్తుత జట్టుపై, ఆటగాళ్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ టీమ్ బాగా ఆడుతోంది. బయట వ్యక్తుల అవసరం మాకు లేదు.'అని గంభీర్ బదులిచ్చాడట.

'జట్టు కుప్పకూలిపోయే పరిస్థితుల్లో మ్యాచ్ను నిలబెట్టే విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు అవసరమే కదా..?' అని గంభీర్ను సదరు రిపోర్టర్ మళ్లీ ప్రశ్నించగా.. గంభీర్ మరింత అసహనానికి గురై ఘాటుగా బదులిచ్చాడట. 'అవును మ్యాచ్ను నిలబెట్టే ఆటగాళ్లు జట్టుకు అవసరమే. ప్రస్తుత జట్టులో అలాంటి ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కఠిన పరిస్థితుల్లో ఆడే సామర్థ్యం వారికి ఉంది. ఒక్క ఓటమితో ఆటగాళ్లను నిందించడం సరికాదు. మిగతా మ్యాచ్ల్లో మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు.
ప్రతి విషయాన్ని విరాట్ కోహ్లీతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనం ప్రపంచకప్ గెలిచాం. ఈ జట్టులోని భారత ఆటగాళ్లందరూ ఛాంపియన్స్. కాబట్టి ఈ విజయం సాధించిన ఆటగాళ్ల గురించే మనం మాట్లాడాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి చర్చించాల్సిన అవసరం లేదు' అని సదరు జర్నలిస్ట్కు గంభీర్ చురకలంటించాడని ఓ నకిలీ కథనాన్ని అల్లారు. అసలు మీడియా సమావేశంలో ఏ జర్నలిస్ట్ విరాట్ కోహ్లీ ప్రస్తావన తీసుకురాలేదు. గంభీర్ కూడా కోహ్లీ పేరు ఎత్తలేదు. కానీ కోహ్లీ హేటర్స్ ఈ ఫేక్ స్టోరీనీ అల్లి ప్రచారం చేస్తున్నారు.
కాకపోతే ఇదే మీడియా సమావేశంలో వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యత ఇవ్వద్దని, ట్రోఫీలను సెలెబ్రేట్ చేసుకోవాలని గంభీర్ సూచించాడు. గతంలో వ్యక్తిగత రికార్డులను సెలెబ్రెట్ చేసుకునేవాళ్లమని కోహ్లీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. తాను హెడ్ కోచ్గా ఉన్నంత కాలం వ్యక్తిగత రికార్డులకు ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేశాడు. కానీ గంభీర్ నోట కోహ్లీ పేరు కూడా రాలేదు.
