టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరులో భారత్ ఘనవిజయం సాధించి విశ్వవిజేతగా నిలవగా.. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో కివీస్ జట్టు వ్యూహాత్మకంగా విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు న్యూజిలాండ్ ఓటమికి దారితీసిన ఆ 'టాక్టికల్ బ్లండర్' ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆ టాక్టికల్ బ్లండర్ ఏమిటి?
అహ్మదాబాద్ పిచ్పై బౌలింగ్లో వైవిధ్యం చూపించడం చాలా కీలకమని అందరికీ తెలిసిన విషయమే. అయితే న్యూజిలాండ్ జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్లో సెమీ-ఫైనల్లో అద్భుతంగా రాణించిన స్పెషలిస్ట్ ఆఫ్-స్పిన్నర్ కోల్ మెక్కాంచీని పక్కన పెట్టింది. అతని స్థానంలో అదనపు పేసర్ జాకబ్ డఫీని జట్టులోకి తీసుకోవడం కివీస్ జట్టు యాజమాన్యం చేసిన అతిపెద్ద బ్లండర్గా మారింది. సెమీ-ఫైనల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేసి కీలక వికెట్లు పడగొట్టిన మెక్కాంచీ వంటి అనుభవజ్ఞుడైన స్పిన్నర్ను ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో బెంచ్కు పరిమితం చేయడం జట్టు బౌలింగ్ బలహీనతకు దారితీసింది.

అభిషేక్కు కలిసొచ్చిన అదృష్టం
భారత యువ కెరటం అభిషేక్ శర్మ ఆఫ్-స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి కొంత ఇబ్బంది పడతాడనే బలహీనత న్యూజిలాండ్ జట్టుకు ముందే తెలుసు. కివీస్ గనుక స్పెషలిస్ట్ స్పిన్నర్ను బరిలోకి దించి ఉంటే.. అభిషేక్ శర్మ పవర్ప్లేలో ఇబ్బంది పడే అవకాశం ఉండేది. కానీ మెక్కాంచీ లేకపోవడంతో స్పిన్ అటాక్ లేని న్యూజిలాండ్ పేసర్లను అభిషేక్ శర్మ అలవోకగా ఎదుర్కొన్నాడు. కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి కివీస్ బౌలర్లను ఉతికి ఆరేయడంతో భారత్ మ్యాచ్ ప్రారంభంలోనే భారీ ఆధిక్యాన్ని సాధించింది.
మ్యాచ్ ఎలా మలుపు తిరిగిందంటే?
టీమిండియా బ్యాటర్లు పవర్ప్లేలో చెలరేగిపోయారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ జోడీ కలిసి కేవలం పవర్ప్లేలోనే 92 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక పవర్ప్లే స్కోరుగా నిలిచింది. ఆరంభంలోనే కివీస్ బౌలర్లు నిస్సహాయంగా మిగిలిపోవడంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఫైనల్ మ్యాచ్లోనే ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం.
ఓటమి ఖాయం
256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయిన కివీస్, చివరకు కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. మొత్తంగా చూస్తే పిచ్ కండిషన్స్ను అంచనా వేయడంలో విఫలం కావడం, సరైన బౌలర్లను ఎంపిక చేయకపోవడమే న్యూజిలాండ్ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ జట్టు మాత్రం ఆరంభం నుంచే అద్భుతమైన వ్యూహాలతో కప్పును దక్కించుకుంది.