T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 నాకౌట్ దశలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ పోరు చుట్టూ సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ రద్దవుతుందనే ఊహగానాలపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇరాన్, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ రద్దవుతుందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది. ఐసీసీ గానీ, బీసీసీఐ గానీ మ్యాచ్ రద్దు గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు.
ఐసీసీ ముందస్తు జాగ్రత్తలు
ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల గగనతలం మూతపడటంతో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడిన మాట నిజమే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐసీసీ కొన్ని కీలక చర్యలు చేపట్టింది. దుబాయ్ మీదుగా కాకుండా యూరప్, ఆగ్నేయాసియా దేశాల మీదుగా ఆటగాళ్లను, సిబ్బందిని తరలించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసింది.టోర్నీ జరుగుతున్న భారత్, శ్రీలంకలలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని.. సెక్యూరిటీ టీమ్ నిరంతరం పర్యవేక్షిస్తోందని ఐసీసీ ధీమా వ్యక్తం చేసింది ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన వెస్టిండీస్, జింబాబ్వే జట్ల ప్రయాణం కాస్త ఆలస్యమైనప్పటికీ.. సెమీస్ ఆడే జట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఐసీసీ చర్యలు తీసుకుంటోంది.

మ్యాచ్ షెడ్యూల్
షెడ్యూల్ ప్రకారం సెమీఫైనల్ మ్యాచ్ యధావిధిగా సాగనుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 5న గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఇంగ్లాండ్, భారత్ జట్లు సెమీ ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్కు క్రిస్ గెఫానీ, అలావుద్దీన్ పాలేకర్ ఈ మ్యాచ్కు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు.
ఒకవేళ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
దురదృష్టవశాత్తూ వాతావరణం లేదా ఇతర అనివార్య కారణాల వల్ల సెమీఫైనల్ మ్యాచ్ పూర్తిగా రద్దయి (రిజర్వ్ డే రోజున కూడా), ఫలితం తేలకపోతే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ ఫైనల్కు చేరుకుంటుంది. సూపర్-8 దశలో ఇంగ్లాండ్ తన గ్రూపులో అగ్రస్థానంలో (టాపర్) నిలవగా.. భారత్ తన గ్రూపులో రెండో స్థానంలో ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలాంటి సందర్భాల్లో గ్రూప్ టాపర్స్కే ప్రాధాన్యత లభిస్తుంది.
అప్రమత్తంగా ఉండండి
ప్రస్తుతం టోర్నీ క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. అభిమానులు కేవలం అధికారిక ఐసీసీ వెబ్సైట్ లేదా నమ్మకమైన వార్తా సంస్థల సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. యుద్ధ ఉద్రిక్తతలు క్రీడలపై ప్రభావం చూపకుండా ఐసీసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.