ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తుది పోరుకు సిద్దమైంది. వరుసగా రెండో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించేందుకు సన్నదమైంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్నా.. సొంతగడ్డపై ఆడుతున్నా.. ప్రత్యర్థికి ఇప్పటిదాకా ఏ ఫార్మాట్లోనూ ప్రపంచకప్ గెలిచిన చరిత్రలేకపోయినా.. భారత్ విజేతగా నిలుస్తుందా? అంటే ధీమాగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
భారత్ తరహాలోనే న్యూజిలాండ్ కూడా పడుతూ లేస్తూ ఫైనల్ చేరింది. కానీ సౌతాఫ్రికాతో సెమీఫైనల్లో ఆ జట్టు సాధికారిక ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు భారత్ మాత్రం సెమీస్లో ఇంగ్లండ్పై గట్టెక్కినా.. తమ బౌలింగ్ బలహీనతలను బయటపెట్టుకుంది. ఇప్పటి వరకు కూడా భారత్ సాధికారిక ప్రదర్శన చేయలేదు. అంతేకాకుండా భారత్కు ఏ మాత్రం అచ్చిరాని అహ్మదాబాద్ మైదానంలో ఈ ఫైనల్ జరుగుతుండటం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

ఇన్నాళ్లు ఆడింది ఒక ఎత్తు అయితే.. ఫైనల్ గెలవడం మరో ఎత్తు. కాబట్టి ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవాలంటే తమ ఆటతో పాటు వ్యూహాలను కూడా మార్చక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సూపర్-8 దశ నుంచి తేలిపోతున్న వరుణ్ చక్రవర్తీని పక్కన పెట్టాలనే డిమాండ్ వినిస్తోంది. బ్యాటర్లు అటాక్ చేయడంతో ఆత్మవిశ్వాసం కోల్పోతున్న వరుణ్ చక్రవర్తీ.. లైన్ అండ్ లెంగ్త్ మిస్సవుతూ ధారళంగా పరుగులిస్తున్నాడు. ఇంగ్లండ్తో సెమీస్లో అతను 4 ఓవర్లలో 64 పరుగులిచ్చుకున్నాడు. అతని కెరీర్లోనే ఇది అత్యంత చెత్త రికార్డ్.
ఈ క్రమంలోనే వరుణ్ చక్రవర్తీ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. మరీ టీమ్మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాలి. విన్నింగ్ కాంబినేషన్ను మార్చేందుకు గంభీర్ పెద్దగా ఇష్టపడకపోవచ్చు. కానీ వరుణ్ ఫామ్ చూస్తే పక్కన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ టోర్నీలో పాకిస్థాన్తో మాత్రమే ఆడిన కుల్దీప్ బెంచ్కే పరిమితమయ్యాడు. మరి టీమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాలి.

ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. తన ఆఫ్ స్పిన్ బలహీనతను అధిగమించలేకపోతున్నాడు. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ.. జింబాబ్వేతో హాఫ్ సెంచరీ బాది టచ్లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ తర్వాతి రెండు మ్యాచ్ల్లో అదే చెత్త ప్రదర్శన కనబర్చాడు. దాంతో అతన్ని పక్కనపెట్టి రింకూ సింగ్ను తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ మాజీ క్రికెటర్లు, టీమ్మేనేజ్మెంట్ మాత్రం అభిషేక్ శర్మకు అండగా నిలుస్తోంది. కనీసం వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికైనా ఫైనల్లో అభిషేక్ శర్మ చెలరేగాలి. అతను స్వేచ్ఛగా ఆడితే మ్యాచ్ వన్సైడ్ అవుతుంది. అది ఫైనల్ కావాలని టీమ్మేనేజ్మెంట్ కోరుకుంటుంది. కాబట్టి రింకూ సింగ్కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.

మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్గా సంజూ సూపర్ ఫామ్లో ఉండగా.. ఇషాన్ కూడా టచ్లోకి వచ్చాడు. కెప్టెన్ సూర్యనే భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్లో ఉన్నారు. టాప్ -6 బ్యాటర్లు ఏ ముగ్గురు చెలరేగినా భారత్ భారీ స్కోర్ చేస్తోంది. అక్షర్ పటేల్ వరకు బ్యాటింగ్ డెప్త్ ఉండటం కలిసొచ్చే అంశం.
పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతుండగా.. హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్ కట్టడిగా బౌలింగ్ చేయాల్సి ఉంది. శివమ్ దూబే బౌలింగ్ను నమ్మలేని పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సత్తా చాటితేనే టీమిండియా విజేతగా నిలుస్తుంది. లేదంటే నోటికాడికి వచ్చిన ముద్ద చేజారినట్లు కప్ కోల్పోతుంది.
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.