టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ చారిత్రక విజయం సాధించడంలో యువ కెరటం అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. గత కొన్ని మ్యాచ్లుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న ఈ యువ సెన్సేషన్.. ఫైనల్ మ్యాచ్లో మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు. అయితే అభిషేక్ శర్మ ఈ మెరుపు ఇన్నింగ్స్ వెనుక ఓ ఆసక్తికరమైన రహస్యం ఉందని మ్యాచ్ తర్వాత వెల్లడైంది.
శివం దూబే బ్యాటుతోనే విధ్వంసం!
ఫైనల్ మ్యాచ్కు ముందు వరకు అభిషేక్ శర్మ తన ఫామ్ను అందుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు. వరుసగా విఫలమవుతున్న తరుణంలో మ్యాచ్ రోజు ఉదయం అభిషేక్ శర్మ ఓ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్నాడు. "ఈరోజు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనిపించింది. అందుకే శివం దూబే దగ్గరికి వెళ్లి అతని బ్యాటును అడిగి తీసుకున్నాను" అని అభిషేక్ మ్యాచ్ తర్వాత బయటపెట్టాడు. శివం దూబే బ్యాటుతో బరిలోకి దిగిన అభిషేక్, కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు.

కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు
శివం దూబే బ్యాటుతో క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి సత్తా చాటాడు.ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సంజూ శాంసన్తో కలిసి పవర్ప్లేలోనే 96 పరుగులు సాధించి, టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక పవర్ప్లే స్కోరును నమోదు చేశారు.
రికార్డుల మోత
అభిషేక్ శర్మ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి, టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే మూడో అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్ (12 బంతులు), మార్కస్ స్టోయినిస్ (17 బంతులు) మాత్రమే అతని కంటే ముందున్నారు.
"టీమ్ నమ్మకమే నా బలం"
తన ఫామ్ గురించి అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. "గత నెల రోజులుగా నేను కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ నా చుట్టూ ఉన్న టీమ్ సభ్యులు నాపై ఉంచిన నమ్మకం నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఫెయిల్ అయినప్పుడు కూడా అందరూ నాపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకమే ఈరోజు నేను రాణించేలా చేసింది" అని తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ యువ ఆటగాడి బ్యాట్ మార్పు, జట్టు యాజమాన్యం అందించిన మద్దతు, భారత్ను మూడోసారి విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాయి.