ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో ఆఖరి ఓవర్ వేయమన్నప్పుడు తీవ్ర ఆందోళనకు గురైనట్లు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే తెలిపాడు. ముఖ్యంగా ఈ ఓవర్ తొలి రెండు బంతులు వేసే ముందు తన గుండె ఆగినంత పనైందని చెప్పుకొచ్చాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్ జాకోబ్ బెతెల్ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో ఆ జట్టు విజయానికి ఆఖరి ఓవర్లో 30 పరుగులు అవసరమయ్యాయి.
భారత ప్రధాన బౌలర్ల కోటా పూర్తవ్వడం.. స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్ మాత్రమే ఉండటంతో సూర్యకుమార్ యాదవ్ శివమ్ దూబేకు ఆఖరి ఓవర్ను అప్పగించాడు. అప్పటి వరకు ఒక్క బంతి కూడా వేయని శివమ్ దూబే నేరుగా ఆఖరి ఓవర్ వేయాల్సి వచ్చింది. ఈ ఓవర్ తొలి బంతికి జాకోబ్ బెతెల్ రనౌటయ్యాడు. ఆ తర్వాత ఒక వైడ్తో పాటు మూడు సిక్స్లు సమర్పించుకున్నశివమ్ దూబే మొత్తం 22 పరుగులు ఇచ్చుకొని భారత్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శివమ్ దూబే.. ఈ ఓవర్ వేసేందుకు తీవ్ర భయాందోళనకు గురైనట్లు వెల్లడించాడు.

'ఆఖరి ఓవర్ వేసే సమయంలో చాలా భయపడ్డాను. నా హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయింది. ఈ ఓవర్లో మొదటి రెండు బంతులు చాలా కీలకమని నాకు తెలుసు. అవే మ్యాచ్ విజేతను నిర్ణయిస్తాయి. అందుకే నేను దాని మీద ఫోకస్ పెట్టాను. ఆ సమయంలో భయానికి గురయ్యాను. వరల్డ్ కప్ సెమీఫైనల్లో చివరి ఓవర్ బౌలింగ్ వేయడం ఎప్పటికీ సవాల్తో కూడుకున్న విషయమే. జాకోబ్ బెతెల్ సెంచరీ చేసి క్రీజులో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం కఠినమని నాకు తెలుసు. ఆత్మవిశ్వాసంతో ఉండాలని, నా సామర్థ్యాలను నమ్ముకోవాలని నాకు నేను గట్టిగా అనుకున్నాను. అలాంటి సమయంలో 10 శాతం ప్రదర్శన చేసినా.. అది చాలా మేలు చేస్తుంది.'అని దూబే పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్లో శివమ్ దూబే 25 బంతుల్లో 43 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో శివమ్ దూబే రాణిస్తున్నా.. అతని బౌలింగ్ అంటే అభిమానులు జంకుతున్నారు.