ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో సరికొత్త చరిత్రను లిఖించింది. డిఫెండ్ ఛాంపియన్గా టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా చరిత్రకెక్కింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో బ్యాట్తో పరుగుల వరద పారించి, బంతితో అలవోకగా న్యూజిలాండ్ను పడగొట్టేసిన సూర్యకుమార్ బృందం విశ్వవిజేతగా నిలిచింది.
ఈ విజయం నేపథ్యంలో భారత ఆటగాళ్లపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా మరికాసేపట్లో భారీ నజరానాను ప్రకటించనుంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, క్రికెట్ అసోసియేషన్స్ కూడా తమ ఆటగాళ్లపై కనకవర్షం కురిపించనున్నాయి.
ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన స్టార్ బ్యాటర్ తిలక్ వర్మకు కూడా కాంగ్రెస్ సర్కార్ నుంచి భారీ బహుమతి లభించనున్నట్లు క్రీడా వర్గాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి టీ20 ప్రపంచకప్ విజయంలో భాగమైన తిలక్ వర్మ, సిరాజ్లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలుస్తోంది. సిరాజ్కు గతంలోనే భారీ రివార్డ్ ప్రకటించిన నేపథ్యంలో తిలక్ వర్మకు ఈ సారి భారీ నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయాలు అధికారికంగా వెల్లడి కాకపోయినా.. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచకప్ గెలిచిన తిలక్ వర్మ, సిరాజ్ ప్రస్తుతం జట్టుతో అహ్మదాబాద్లోనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని భారత జట్టు కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత బీసీసీఐ నిర్వహించే విజయోత్సవ వేడుకల్లో జట్టు పాల్గొననుంది. బుధవారం లేదా గురువారం తిలక్ వర్మ, సిరాజ్ హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఈ ఇద్దరి ఛాంపియన్స్ను ఘనంగా స్వాగతం పలికేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించేందుకు హెచ్సీఏ సిద్దమైంది.
అసాధారణ ప్రదర్శనతో తెలంగాణ గర్వపడేలా చేసిన తిలక్ వర్మ, మహమ్మద్ సిరాజ్లను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్మానించే అవకాశం ఉంది. ఈ సందర్భంగానే తిలక్కు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు క్యాష్ ప్రైజ్, ఇంటి స్థలంను బహుమతిగా అందజేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో భాగంగా ఉన్న సిరాజ్కు తెలంగాణ సర్కార్ డీఎస్పీ ఉద్యోగంతో పాటు జూబ్లీహిల్స్లో 600 గజాల నివాస స్థలాన్ని బహుమతిగా అందజేసింది.
తిలక్ వర్మకు కూడా గ్రూప్-1 ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం బహుమతిగా అందజేయవచ్చని స్పోర్ట్స్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. భారత విజయాన్ని కొనియాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తిలక్ వర్మను ప్రత్యేకంగా కొనియాడారు. ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ.. సీఎం రేవంత్ రెడ్డిని కలవగా ప్రత్యేకంగా అభినందించారు. ఆ సమయంలోనే తిలక్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ప్రపంచకప్ గెలిపించాలని తిలక్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించనట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో తిలక్ వర్మ 9 మ్యాచ్ల్లో 154.47 స్ట్రైక్రేటుతో 207 పరుగులు చేశాడు. చివర్లో బ్యాటింగ్కు వచ్చి విలువైన పరుగులు అందించాడు.
