క్రికెట్ లోకమంతా ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ వేడిలో ఉంది. ఆతిథ్య భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక పోరుకు ముందు ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. తన అంచనా ప్రకారం భారత్ ఈ మ్యాచ్లో ఓడిపోతుందని ఆయన పరోక్షంగా కామెంట్ చేయడం భారత అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న కివీస్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. కోల్కతా వేదికగా జరిగిన మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో కివీస్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి.. గ్రాండ్ ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. ఇప్పుడు మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే తుది పోరులో కివీస్తో తలపడే ప్రత్యర్థి ఎవరో తేలాల్సి ఉంది.

పీటర్సన్ మైండ్ గేమ్?
నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కెవిన్ పీటర్సన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ అంచనాను షేర్ చేశారు. " ఆదివారం జరగబోయే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి. ఇది చాలా మంచి గేమ్ అవుతుంది" అని ఆయన పేర్కొన్నారు. అంటే భారత్ తన సొంత గడ్డపై సెమీస్లోనే వెనుదిరుగుతుందని.. ఇంగ్లాండ్ ఫైనల్ చేరుతుందని పీటర్సన్ జోస్యం చెప్పారు. ఇది పీటర్సన్ ఆడుతున్న మైండ్ గేమ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత రికార్డులు.. సమవుజ్జీల పోరు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గత వరల్డ్ కప్ సెమీఫైనల్ రికార్డులను గమనిస్తే పోరు హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది. 2022 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి షాక్ ఇవ్వగా.. 2024లో జరిగిన గత ప్రపంచకప్లో భారత్ ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. గయానాలో జరిగిన ఆ మ్యాచ్లో రోహిత్ సేన 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. ప్రస్తుతం రెండు జట్లు కూడా పటిష్టంగా ఉండటంతో నేటి మ్యాచ్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
పీటర్సన్ కెరీర్ పై ఒక లుక్
45 ఏళ్ల కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాళ్లలో ఒకరు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆయన, ఇంగ్లాండ్ తరపున 104 టెస్టుల్లో 8,181 పరుగులు, 136 వన్డేల్లో 4,440 పరుగులు, 37 టీ20ల్లో 1,176 పరుగులు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 32 సెంచరీలు బాదిన రికార్డు ఆయనకుంది. అప్పట్లో తన దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థి జట్లను భయపెట్టిన పీటర్సన్.. ఇప్పుడు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.
తుది పోరుకు రంగం సిద్ధం
నేడు జరిగే సెమీఫైనల్లో విజేతగా నిలిచిన జట్టు.. మార్చి 8న అహ్మదాబాద్లో న్యూజిలాండ్తో తలపడనుంది. పీటర్సన్ చెప్పినట్లు ఇంగ్లాండ్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందా? లేక కోట్లాది మంది భారతీయుల ఆశలను మోస్తూ టీమిండియా ఫైనల్కు దూసుకెళ్తుందా? అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది.