అహ్మదాబాద్ ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉంచడమే తమ లక్ష్యమని చెప్పిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్కు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదిరిపోయే కౌంటరిచ్చాడు. ఇది అరిగిపోయిన డైలాగ్ అని, ప్రతీ ఒక్కరు ఇదే చెబుతున్నారని, కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయాలని సూర్య సూచించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టైటిల్ నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. తొలి టీ20 ప్రపంచకప్ను ముద్దాడాలనే లక్ష్యంతో కివీస్ ఉంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియా సమావేశంలో ఇరు జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. స్టేడియంలోని ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉంచడమే తమ లక్ష్యమని సాంట్నర్ పేర్కొన్నాడు. అంతేకాకుండా టైటిల్ గెలిచి భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేసేందుకు కూడా తాము వెనుకాడబోమని స్పష్టం చేశాడు.

ఈ వ్యాఖ్యలను సూర్యకుమార్ యాదవ్ ముందు ప్రస్తావించగా.. ప్రతీ ఒక్కరికి ఈ డైలాగ్ చెప్పడం అలవాటైందన్నాడు. 'అందరూ అదే పాత డైలాగ్ చెప్తున్నారు. కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయండి' అని నవ్వుతూ బదులిచ్చాడు. పిచ్ గురించి తమకు ఎలాంటి ఆందోళన లేదన్న సూర్య.. బుమ్రా తమ ఎక్స్ ఫ్యాక్టర్ అని పేర్కొన్నాడు. కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ అడుగుజాడల్లో నడుస్తున్నానని, తుది జట్టు మార్పుల గురించి టాస్ సమయంలోనే తెలుస్తుందని స్పష్టం చేశాడు. విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతామని పరోక్ష సంకేతాలు ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్కు టీమిండియా అన్ని విధాల సిద్దమైందని తెలిపాడు.

'నేను ఇంకా పిచ్ను చూడలేదు. ఏ మట్టి అయినా మాకు ఓకే. ఎందుకంటే టోర్నీ అంతా మేం ఎర్రటి, నల్లటి పిచ్లపై ఆడాం. పిచ్ను బట్టి మా ఆట తీరు ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్. అతనికి ఏ సమయంలో ఎలా బౌలింగ్ చేయాలో బాగా తెలుసు. సెమీఫైనల్లో అతను గేమ్ ఛేంజర్గా నిలిచాడు. రేపటి ఫైనల్లోనూ అతను అద్భుతం చేస్తాడనే నమ్మకం మాకు ఉంది. షూస్ నావే కానీ అడుగుజాడలు మాత్రం రోహిత్ భాయ్వే. అతని నాయకత్వంలో ఆడినప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ వ్యూహాలనే కెప్టెన్గా నేను కూడా అనుసరిస్తున్నాను. జట్టులో వాతావరణం చాలా ప్రశాంతంగా.. సంతోషంగా ఉంది.
వరుణ్ చక్రవర్తీ వరల్డ్ నంబర్ వన్ బౌలర్. అతని ఫామ్పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. మా దృష్టంతా గెలవడంపైనే ఉంది. జట్టును ఎలా విజేతగా నిలబెట్టాలో అతనికి బాగా తెలుసు. క్రికెట్ అనేది జట్టుగా ఆడే ఆట. ఎవరికైనా ఒక రోజు కలిసిరాకపోవచ్చు. ఒకరి ప్రదర్శన బాగోలేనప్పుడు.. మిగిలిన 10 మంది మెరుగ్గా రాణించి అతని వైఫల్యాన్ని కవర్ చేస్తారు. వరుణ్ చక్రవర్తీపై మాకు పూర్తి నమ్మకం ఉంది. తుది జట్టులో మార్పుల గురించి టాస్ సమయంలోనే తెలుస్తుంది. అన్నీ ఇప్పుడే తెలిస్తే ఎలా?
కష్టానికి తగ్గ ప్రతిఫలం సంజూ శాంసన్కు దక్కుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, నేను కలిసి మ్యాచ్ పరిస్థితులను బట్టి తుది నిర్ణయాలు తీసుకుంటాం. సంజూ గత కొంతకాలంగా చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తోంది. మేం డ్రెస్సింగ్ రూమ్లో కూర్చుని 250 కొట్టాలని ముందే అనుకోం. పిచ్ ఎలా ఉందో చూసి.. దానికి తగ్గట్టుగా మా ఆట తీరు ఉంటుంది.'అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.

తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలపై స్పందించేందుకు సూర్యకుమార్ యాదవ్ నిరాకరించాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఫైనల్ గెలవడంపైనే ఉందని, జట్టును నడిపించడం ప్రత్యేకమైన అనుభూతని చెబుతూ.. రిటైర్మెంట్పై అడిగిన ప్రశ్నను దాటవేశాడు. ఫైనల్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది.