

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై బౌలర్ల సహనాన్ని పరీక్షించిన శిఖర్ ధావన్ 47 బంతుల్లో 51 పరుగులతో హఫ్ సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
దీంతో శిఖర్ ధావన్ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5 చేరిపోయాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా(5004) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ(4954), రోహిత్ శర్మ(4507), గౌతమ్ గంభీర్(4217)లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజాగా ధావన్ (4146)పరుగులతో ఈ జాబితాలో చేరాడు.
అంతేకాదు ఈ మ్యాచ్లో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాధించడంతో చెన్నై సూపర్ కింగ్స్పై ఆరుసార్లు హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ధావన్ మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు విరాట్కోహ్లీ, రోహిత్శర్మ మాత్రమే ఉన్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా ఆడుతున్న యువ ఓపెనర్ పృథ్వీ షా(24; 16 బంతుల్లో 5 ఫోర్లు) జట్టు స్కోరు 36 వద్ద ఔటవ్వగా... శిఖర్ ధావన్(51: 47 బంతుల్లో 7ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన శ్రేయస్ అయ్యర్ (18; 20 బంతుల్లో 1 సిక్స్)తో కలిసి ధావన్ ఇన్నింగ్స్ను సరిదిద్దాడు.
కీలక సమయంలో శ్రేయాస్ అయ్యర్ను ఇమ్రాన్ తాహిర్ ఎల్బీగా పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత ప్రమాదకరంగా మారుతున్న రిషబ్ పంత్(25;13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బ్రావో వేసిన భారీ షాట్ ఆడి.. బౌండరీ లైన్ వద్ద శార్దుల్ ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో 15.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న ఢిల్లీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది.
శిఖర్ ధావన్ దూకుడుగా ఆడే క్రమంలో డ్వేన్ బ్రావో వేసిన 18వ ఓవర్ తొలి బంతికే వెనుదిరిగాడు. చివర్లో రాహుల్ తెవాతియా(11 నాటౌట్), అక్షర్ పటేల్(9 నాటౌట్)లు తలో బౌండరీ సాధించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదనలో షేన్ వాట్సన్ (44: 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు), మహేంద్రసింగ్ ధోని (32 నాటౌట్: 35 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో.. మరో 2 బంతులు మిగిలి ఉండగానే చెన్నై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్ అమిత్ మిశ్రా ఓ వికెట్ తీయడంతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఇప్పటివరకూ 50 వికెట్లు తీశాడు. మొత్తంగా 137 ఐపీఎల్ మ్యాచులలో 148 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో రెండో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.