చివరి ఓవర్ ఆఖరి బంతికి సన్రైజర్స్ హైదరాబాద్ టెయిలెండర్ జయదేవ్ ఉనాద్కత్ ఇచ్చిన క్యాచ్ను పట్టి ఉంటే విజయం సాధించేవాళ్లమని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఉనాద్కత్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద హర్షల్ పటేల్ నేలపాలు చేయడంతో పాటు సిక్సర్ను కూడా అడ్డుకోలేకపోయాడు. దాంతో మూమెంటమ్ సన్రైజర్స్ వైపు రాగా.. చివరకు ఆ సిక్సరే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శిఖర్ ధావన్.. తమ కుర్రాళ్ల ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మ్యాచ్లో ఓడినా తమ ప్లేయర్లు గర్వపడేలా పోరాడారని కొనియాడాడు.

'శశాంక్ సింగ్, అషుతోష్ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. మేం సన్రైజర్స్ను తక్కువ స్కోర్కే కట్టడి చేశాం. కానీ మా బ్యాటింగ్ పవర్ ప్లేలో మంచి శుభారంభాన్ని అందుకోలేకపోయాం. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయాం. దాంతొ వెనుకబడ్డాం. ఇది మా విజయవకాశాలను దెబ్బతీసింది. వికెట్పై బౌన్స్ లభించనప్పుడు ప్రతీ ఒక్కరు తమ అప్రోచ్ మార్చుకోవాలి.
చివరి బాల్కు మేం క్యాచ్ నేలపాలు చేశాం. మేం మరో 10-15 పరుగులు తక్కువగానే సన్రైజర్స్ను కట్టడి చేయాల్సింది. కుర్రాళ్లు నిలకడగా రాణించడం బాగుంది. మ్యాచ్ను ముగించగలరనే నమ్మకాన్ని కలిగించారు. ఈ మ్యాచ్లో ఓడినా.. మా ఆటగాళ్ల పోరాట పటిమ ఆకట్టుకుంది. మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ముందు ముందు టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ ఓటమి ఉపయోగపడుతుంది.'అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 64) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులే చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(25 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 46 నాటౌట్), అషుతోష్ శర్మ(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 33 నాటౌట్) సంచలన బ్యాటింగ్తో సన్రైజర్స్ను ఓడించినంత పని చేశారు.