తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచిన పంజాబ్ కింగ్స్ రెండో పోరులో తడబడింది. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ గట్టిపోటీనే ఇచ్చింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (45; 37 బంతుల్లో) టాప్ స్కోరర్. శశాంక్ సింగ్ (21*; 8 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (77; 49 బంతుల్లో) అర్ధశతకంతో సత్తాచాటాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (28*; 10 బంతుల్లో), మహిపాల్ లోమ్రర్ (17*; 8 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్లతో జట్టును గెలిపించారు.

కాగా, ఈ మ్యాచ్ గురించి దిగ్గజ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, అనిల్ కుంబ్లే మాట్లాడారు. పంజాబ్ కింగ్స్ ఓటమికి గల కారణాలు చర్చించారు. ధావన్ తీసుకున్న పేలవమైన వ్యూహాలు ఓటమికి ఓ కారణమని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. రబాడ నాలుగు ఓవర్ల కోటా ముందే పూర్తిచేయడం పంజాబ్కు కలిసిరాలేదని అన్నాడు.
నాలుగు ఓవర్లు వేసిన రబాడ 23 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే రబాడ 14 ఓవర్లలోపే తన స్పెల్ను ముగించాడు. ''అది ధావన్ చేసిన తప్పు. ఆ నిర్ణయాన్ని నేను ఎప్పటికీ అంగీకరించను. ఆర్సీబీ బాగానే ఆడుతుందని తెలుసు. కాబట్టి మ్యాచ్ ఆఖరి వరకు సాగుతుంది. ఆఖర్లో రబాడ ఉండాల్సింది'' అని డివిలియర్స్ అన్నాడు.
అయితే స్పిన్నర్ రాహుల్ చాహర్ విఫలమవ్వడంతో రబాడ కోటాను ధావన్ ముందే పూర్తిచేయాల్సి వచ్చిందని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ''ఒకవేళ రాహుల్ చక్కగా బౌలింగ్ చేసి ఉంటే, రబాడను ఆఖరి వరకు పంజాబ్ ఉంచేది'' అని కుంబ్లే అన్నాడు. రాహుల్ చాహర్ ఒక్క ఓవర్ వేసి 16 పరుగులు సమర్పించుకున్నాడు.