పంజాబ్ కింగ్స్పై లక్నో సూపర్ జెయింట్స్ 21 పరుగుల తేడాతో గెలిచింది. ఐపీఎల్ 17వ సీజన్లో లక్నోకు ఇదే తొలి విజయం. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 199 పరుగులు చేసింది. డికాక్ (54; 38 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కృనాల్ పాండ్య (43*; 22 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (42; 21 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.శిఖర్ ధావన్ (70; 50 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జానీ బెయిర్స్టో (42; 29 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడారు. 21 ఏళ్ల LSG ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. సగటున గంటకు 150 కి.మీ వేగంతో బంతులు విసిరాడు. నాలుగు ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తమ ఓటమికి గల కారణాలు వివరించాడు. తమ బ్యాటర్ లివింగ్స్టోన్ (28*; 17 బంతుల్లో)కు గాయమవ్వడం, మయాంక్ యాదవ్ వేగవంతమైన గల క్రమశిక్షణ బౌలింగ్ తమ జట్టు పరాజయానికి కారణమయ్యాని ధావన్ పేర్కొన్నాడు.
''లక్నో టీమ్ బాగా ఆడింది. మా బ్యాటర్ లివింగ్స్టోన్కు గాయమైంది. అది మమ్మల్ని తీవ్రంగా దెబ్బకొట్టింది. అతడు నాలుగో స్థానంలో రావాల్సి ఉంది. అయితే మేం గొప్పగా ఛేదన ప్రారంభించాం. కానీ మయాంక్ తన వేగంతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతనిని ఎదుర్కోవడం చాలా బాగుంది. అతని వేగం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అనుభవం ఉన్న ఆటగాడికి తనని ఎదుర్కోగలను. కానీ అతడు యార్కర్లతో డాట్ బాల్స్ వేస్తూ, సింగిల్కు మాత్రమే పరిమితమయ్యేలా చేశాడు''
''పేస్ను ఉపయెగించుకుని మైదానంలో షార్ట్ సైడ్ బౌండరీలు సాధించాలని మా బ్యాటర్లతో చెప్పాను. కానీ మయాంక్ బెయిర్స్టో శరీరానికి విసిరి వికెట్ సాధించాడు. మయాంక్ స్పెల్ను వదిలేసి ఇతర బౌలర్లపై దృష్టిపెట్టాలని జితేశ్ శర్మతో చెప్పాను. కానీ మిగిలిన బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఓటమి మరింత విశ్లేషణ చేసుకుంటాం. క్యాచ్లను చేజార్చడం వల్ల మ్యాచ్ను మా నుంచి కోల్పోతున్నాం. ఆ విషయంలో మేం మెరుగవ్వాలి. విజయానికి దగ్గరగా వచ్చాం. మరో పది శాతం మరింత సత్తాచాటాల్సి ఉంది'' శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.