పంజాబ్ కింగ్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ మరికొన్ని రోజుల పాటు మ్యాచ్లకు దూరం కానున్నాడు. దాదాపు వారం నుంచి పది రోజుల వరకు ధావన్ అందుబాటులో ఉండడని పంజాబ్ కింగ్స్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. భుజానికి గాయమైన కారణంగా నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్కు కూడా గబ్బర్ దూరమైన విషయం తెలిసిందే.
శిఖర్ ధావన్ గురించి సంజయ్ బంగర్ మాట్లాడుతూ తొలుత.. కొన్ని రోజుల పాటు తమ జట్టు సారథి అందుబాటులో ఉండడని చెప్పాడు. కాసేపటికీ కనీసం వారం నుంచి పది రోజులు పాటు తిరిగి బరిలోకి దిగడని పేర్కొనడం గమనార్హం. ''ధావన్ భుజానికి గాయమైంది. ఈ క్రమంలో అతడు కొన్నిరోజులు దూరంకానున్నాడు. శిఖర్ ధావన్ వంటి అనుభవజ్ఞుడు, పైగా పిచ్లపై అతడికి ఉన్న అనుభవం దూరమవుతుందంటే అది చాలా తీవ్రమైన అంశం''

''ధావన్ కోసం ఎదురుచూస్తున్నాం. చికిత్సకు అతడు ఎలా స్పందిస్తున్నాడో పరిశీలిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అతడు మరో ఏడు నుంచి పది రోజులు పాటు మైదానంలో అడుగుపెట్టలేడు'' అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. రాజస్థాన్ చేతిలో ఓటమి గురించి స్పందిస్తూ.. ''టాప్ ఆర్డర్ సత్తాచాటలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. వాళ్లు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం అనుకూలంగా రావట్లేదు. ముల్లాన్పూర్ వికెట్ కూడా ఓ కారణం. ఇక్కడ తక్కువ స్కోరులు నమోదవుతాయి'' అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.
ముల్లాన్పూర్ వేదికగా శనివారం రాజస్థాన్ రాయల్స్తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 147 పరుగులు చేసింది. అశుతోష్ శర్మ (31*; 16 బంతుల్లో, 1x4, 3x6) టాప్ స్కోరర్. మహరాజ్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం రాజస్థాన్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హెట్మెయిర్ (27*; 10 బంతుల్లో, 1x4, 3x6) విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వీ జైస్వాల్ (39; 28 బంతుల్లో, 4x4) టాప్ స్కోరర్.