ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 176 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది.
శిఖర్ ధావన్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 45), ప్రభ్సిమ్రాన్ సింగ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 25), జితేశ్ శర్మ(20 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో శశాంక్ సింగ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 21 నాటౌట్) ధాటిగా ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, గ్లేన్ మ్యాక్స్వెల్ రెండేసి వికెట్లు తీయగా.. యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో బెయిర్ స్టో(8) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన ప్రభ్సిమ్రాన్ సింగ్(25)తో కలిసి శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది.
అనంతరం ధాటిగా ఆడిన ఈ జోడీ.. వేగంగా పరుగులు చేసింది. 72 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని మాక్స్వెల్ విడదీసాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్(25)ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరాడు.
క్రీజులోకి వస్తూనే దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన లివింగ్స్టోన్(17)ను అల్జారీ జోసెఫ్ ఔట్ చేశాడు. ఆ వెంటనే హాఫ్ సెంచరీకి చేరువైన శిఖర్ ధావన్ను మ్యాక్స్వెల్ క్యాచ్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన సామ్ కరణ్(23), జితేశ్ శర్మ(27)కూడా త్వరగానే పెవిలియన్ చేరారు.
అల్జారీ జోసెఫ్ వేసిన చివరి ఓవర్లో శశాంక్ సింగ్ రెండు భారీ సిక్సర్లతో 20 పరుగులు పిండుకోవడంతో పంజాబ్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. అల్జారీ జోసెఫ్ 20 పరుగులిచ్చి ఆర్సీబీ కొంపముంచాడు.