గెలుస్తామనుకోలేదు.. కానీ
‘భీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన వెస్టిండీస్ ముందు మేం చేసిన 183 పరుగులు చాలా తక్కువగా అనిపించాయి. ఏ దశలోనూ మాకు గెలుస్తామనే ఆశకలగలేదు. కానీ కపిల్ దేవ్ చెప్పిన మాటలు మాలో స్పూర్తిని రగిల్చాయి. అతను కూడా గెలుస్తామనేం చెప్పలేదు. కానీ ఆఖరి బంతి వరకు పోరాడాలన్నాడు. ‘గాయ్స్ చూడండి.. మనం 183 పరుగులకే ఆలౌటయ్యాం. కానీ మనం వారిని ఖచ్చితంగా అడ్డుకోవాలి. అంత సులువుగా వదిలి పెట్టవద్దు'అని కపిల్ మాతో అన్నాడు.'అని శ్రీకాంత్ నెమరువేసుకున్నాడు.
ఆ విజయమే టర్నింగ్ పాయింట్
‘1983 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్కు, దేశ అభిమానులకు ఓ టర్నింగ్ పాయింట్. ఆ సమయంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇతర కొన్ని దేశాలు క్రికెట్ ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అండర్డాగ్గా బరిలోకి దిగిన భారత జట్టు అనూహ్యంగా విశ్వవిజేతగా నిలిచింది. ఆ అనుభూతిని వివరించడం కొంచెం కష్టమే. అదొకి విచిత్రమైన అనుభవం. ఓ భారతీయుడిగా గర్వించే క్షణం అది.'అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
నిలబెడతావో పడగొడతావో నీ ఇష్టమన్నాడు: గంభీర్
రూ. 25వేల బోనస్..
ఇక ఫైనల్కు ముందు బీసీసీఐ పెద్దలు ఆటగాళ్లకు ప్రకటించిన రూ.25 వేల బోనస్ థ్రిల్లింగ్ కలిగించిందన్నాడు. ‘ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా బోర్డు పెద్దలంతా సమావేశమైన విషయం నాకింకా గుర్తుంది. జాయింట్ సెక్రటరీతో పాటు అందరూ ఆ భేటీలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో ‘రేపు జరిగే ఫైనల్ గురించి దిగులు చెందకండి.. ఇప్పటికే మీరు చాలా సాధించారు. రేపు మ్యాచ్ గెలిచానా, ఓడినా మనందరికి రూ.25వేల బోనస్ ఉంటుంది.'అని చెప్పారు. దీంతో మేమంతా థ్రిల్లింగ్కు గురయ్యాం'అని ఈ మాజీ ఓపెనర్ గుర్తు చేసుకున్నాడు.
ఎలాంటి ఒత్తిడి లేదు..
నిజాయితీగా చెప్పాలంటే ఆ ఫైనల్ సందర్భంగా తాము ఎలాంటి ఒత్తిడికి గురికాలేదన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే.. నాటి ఫైనల్తో ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. మా అందరికి గొప్ప అవకాశమే తప్పా.. పోగుట్టుకోవడానికి ఏం లేదనుకున్నాం. ఎందుకంటే విండీస్ 1975,79 వరల్డ్ చాంపియన్. ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న అద్భుతమైన జట్టు. కాబట్టి మాకో మంచి అవకాశం అనుకున్నాం. 'అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
శ్రీకాంతే టాప్ స్కోరర్..
ఇక నాటి ఫైనల్లో భారత్ 183 పరుగులు చేయగా.. శ్రీకాంత్ (38) టాప్ స్కోరర్ కావడం గమనార్హం. అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో కపిల్ సేన తొలి ప్రపంచకప్ను ముద్దాడింది. ఆ గెలిచిన క్షణం కారణంగానే యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నేడు భారత్ శాసిస్తోంది. మనదేశంలో క్రికెట్ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి బీజం పడింది కూడా అప్పుడే. ఆ విజయం తర్వాత మరో 28 ఏళ్ల వరకు భారత్ విశ్వవిజేతగా నిలవలేకపోయింది. ధోనీ సారథ్యంలోని జట్టు మరోసారి 2011 ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే.