న్యూఢిల్లీ: టెస్ట్ క్రికెట్పై తనకున్న అభిమానాన్ని ఎన్నోసార్లు చాటుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మరోసారి తన ఇష్టాన్ని బయటపెట్టాడు.
తాను బ్యాటింగ్ చేసే ఓ అద్భుతమైన త్రోబ్యాక్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన విరాట్.. టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం గొప్ప అదృష్టమని పేర్కొన్నాడు. 'మెరిసే తెల్లదుస్తుల్లో ఆడే నిజమైన ఆటకు.. ఏదీ దరిదాపుల్లోకి కూడా రాదు. టెస్ట్ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం గొప్ప అదృష్టం'అని ఆ ఫొటోకు క్యాప్షన్గా రాసుకొచ్చాడు.
టెస్టు క్రికెటే నిజమైన ఆటని, ప్రాభవం కోల్పోతున్న ఈ ఫార్మాట్కు ప్రేక్షకాదరణ పెరగాలని ఎప్పుడూ కోరుకునే విరాట్.. అందుకోసం తనవంతుగా కృషి చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ప్రవేశపెట్టిన డే/నైట్ టెస్టులకు, ప్రపంచ టెస్టు ఛాంపియన్కు మద్దతు తెలిపాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించిన కోహ్లీ.. టెస్టుల్లో తొలుత తడబడ్డాడు. ఎక్కడైతే విఫలమయ్యాడో అక్కడే మళ్లీ సత్తా చాటి ఏ ఫార్మాట్లోనైనా ఆడగల బ్యాట్స్మన్గా నిరూపించుకున్నాడు.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పిచ్లపై చెలరేగి ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్గా పేరు తెచ్చుకున్నాడు. ధోనీ టెస్టులకు దూరమయ్యాక జట్టు పగ్గాలు అందుకొని టీమిండియాను విజయపథంలో నడిపించాడు. ఈ క్రమంలోనే గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ గెలుపొందాడు. అనంతరం భారత జట్టుకు అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు మొత్తం 86 టెస్టులాడిన భారత సారథి 53 సగటుతో 7,240 పరుగులు చేశాడు. వాటిలో 27 శతకాలుండగా 22 అర్ధశతకాలున్నాయి. ఇక ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లో టెస్టు సిరీస్లు గెలవడమే లక్ష్యంగా విరాట్ ముందుకు సాగుతున్నాడు.