బ్రేక్ ఇట్ ఆర్ మేక్ ఇట్..
ఐపీఎల్ ప్రారంభం నుంచి జట్టును నడిపించిన సౌరవ్ గంగూలీ.. 2011లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా జట్టు యాజమాన్యం భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్పై నమ్మకముంచి అతడికి కెప్టెన్సీ అప్పగించింది. అప్పుడు కేకేఆర్ సహచర యజమాని, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనతో ఏమన్నాడో గంభీర్ తాజాగా క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నాడు.
‘ఇది నీ జట్టు. దీన్ని నిలబెడతావో.. పడగొడతావో నీ ఇష్టం. నేను మధ్యలో జోక్యం చేసుకోను అని షారుఖ్ నాతో అన్నాడు. తర్వాత నేనొకటే విషయం చెప్పాను. ఇదెక్కడికి తీసుకెళ్తుందో నాకు తెలియదు. కానీ, నేను జట్టును వీడే సమయానికి.. అది మూడేళ్లు అవ్వొచ్చు లేదా ఆరేళ్లు అవ్వొచ్చు.. అప్పటికి మంచి స్థితికి తీసుకెళతానని బదులిచ్చా' అని గంభీర్ వివరించాడు.
రెండు సార్లు విజేతగా..
గంభీర్ సారథ్యంలో కోల్కతా 2012, 2014 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది. గంభీర్ నేతృత్వంలోనే సూర్యకుమార్ యాదవ్, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ లాంటి ఆటగాళ్లు తమ ప్రతిభ చాటుకున్నారు. మైదానంలో దూకుడుగా ఉండటం, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం ద్వారా ఆ జట్టులో వినూత్న మార్పులు తెచ్చాడు. ఇక కేకేఆర్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ గంభీర్ కెప్టెన్ కూల్ కాదని, ఏ సమయంలోనైనా ఆటగాళ్లకు అండగా ఉంటాడని చెప్పాడు. ఆట పట్ల అతనికున్న అంకితభావమే గంభీర్ విజయానికి కారణమని తెలిపాడు.
గంభీర్ పరుగుల రికార్డు..
ఇక 2012లో కేకేఆర్ తొలిసారి టైటిల్ సాధించినప్పుడు.. ఆ సీజన్లో గంభీర్ దూకుడుగా ఆడి 16 మ్యాచ్ల్లో 590 పరుగులు చేశాడు. దీంతో తన ఐపీఎల్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదుచేశాడు. ఆ జట్టుకు ఏడేళ్లు నాయకత్వం వహించిన అతడు మొత్తం 122 మ్యాచ్ల్లో 3,345 పరుగులు చేసి ఆ ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే 2018లో జట్టు బాధ్యతల నుంచి తప్పుకోగా, దినేశ్ కార్తిక్ సారథిగా ఎంపికయ్యాడు. అతడి సారథ్యంలో 2018లో మూడో స్థానంలో నిలిచిన కేకేఆర్ గతేడాది ప్లేఆఫ్స్కు కూడా క్వాలిఫై అవ్వకపోవడం గమనార్హం.