ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియాపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశంసల జల్లు కురిపించాడు. ఇది కదా ఛాంపియన్ ఆట అంటే అని కొనియాడాడు. ఈ టోర్నీలో టీమిండియా ప్రయాణం గొప్పగా సాగిందని, ఈ విజయానికి వారు పూర్తి అర్హులని తెలిపాడు.
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 96 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఈ విజయాన్ని తక్కువ చేస్తూ పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లంతా భారత్పై తమ అక్కసు వెళ్లగక్కగా... అఫ్రిది మాత్రం ప్రశంసల జల్లు కురిపించాడు. భారత్ విజయాన్ని కొనియాడుతూ ఎక్స్వేదికగా అఫ్రిది ఓ వీడియోను ట్వీట్ చేశాడు.
'టీ20 ప్రపంచకప్ ముగిసింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడానికి పూర్తి అర్హత ఉంది. వారి కాంబినేషన్ అద్భుతం. తుది జట్టులో ఉన్న ఆటగాళ్లే కాకుండా.. బెంచ్ ఆటగాళ్లు కూడా అంతే బలంగా ఉన్నారు. అందుకే బెంచ్ బలంగా ఉంటే జట్టు విజయం సాధిస్తుందని నేను ఎప్పుడూ చెబుతంటాను. భారత జట్టులోని 15 మందిలో ప్రతీ ఒక్కరు మ్యాచ్ విన్నరే. టీమిండియా ఈ టోర్నీ అంతా ఒక ఛాంపియన్లా ఆడింది.

సంజూ శాంసన్ ప్రదర్శన అమోఘం. తనకు వచ్చిన అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూనే.. భారీ హిట్టింగ్తో ఇన్నింగ్స్ను నిర్మించగల సత్తా అతనికి ఉంది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కూడా అసాధారణ ప్రదర్శన కనబర్చారు.
జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ విభాగానికి వెన్నెముక. చాలా కాలంగా భారత జట్టును తన భుజాలపై మోస్తున్నాడు. కొత్త బంతి అయినా.. పాత బంతి అయినా.. స్లోయర్, యార్కర్ ఏదైనా సరే.. నా దృష్టిలో బుమ్రానే అత్యుత్తమ బౌలర్' అని అఫ్రిది కొనియాడాడు. ఈ టోర్నీలో సౌతాఫ్రికాతో మాత్రమే ఓడిన టీమిండియా.. మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి మూడో టీ20 ప్రపంచకప్ను ముద్దాడింది.