ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో ఈ ఇద్దరూ బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో సత్తా చాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం ఇద్దరూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఇద్దరూ పోటీపడ్డారు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
జీవితంలో ఎదురయ్యే కష్టాల గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను చెప్తానంటే తాను చెప్తానని ఇషాన్, అభిషేక్ గొడవపడ్డారు. తాను చెప్తానని అభిషేక్ శర్మ అనగా.. 'నీది కేవలం ఒక నెలకు సంబంధించిన కష్టం. నాది రెండేళ్ల ఘోసరా.. బాబు'అని బదులిచ్చాడు. దానికి అభిషేక్ బదులిస్తూ.. 'ఈ ఒక్క నెలనే.. నీ రెండేళ్ల కష్టంగా భావించా'అని అభిషేక్ సమాధానమిచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. 'సరిపోయారు ఇద్దరూ'అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో అభిషేక్ శర్మ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ.. సూపర్-8లో సౌతాఫ్రికాతో 15 పరుగులే చేశాడు. జింబాబ్వేతో 55 హాఫ్ సెంచరీతో రాణించినా.. వెస్టిండీస్తో 10, ఇంగ్లండ్తో సెమీస్లో 9 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు.
దాంతో అభిషేక్ శర్మను తీసేయాలనే డిమాండ్ వ్యక్తమైంది. కానీ టీమ్మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచి ఫైనల్లో ఆడించగా.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది టీమిండియా భారీ స్కోర్కు బాటలు వేసాడు. కీలక ఫైనల్లో సత్తా చాటడంతో అభిషేక్ శర్మ సంతోషానికి గురయ్యాడు.
మరోవైపు ఇషాన్ కిషన్ గత రెండేళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు కెప్టెన్గా జార్ఖండ్కు తొలి టైటిల్ అందించి భారత జట్టులోకి దూసుకొచ్చాడు.
న్యూజిలాండ్తో సిరీస్కు బ్యాకప్ ఓపెనర్ కమ్ కీపర్గా ఎంపికైన ఇషాన్ కిషన్.. అభిషేక్ శర్మ గైర్హాజరీలో బరిలోకి దిగి సత్తా చాటాడు. దాంతో సంజూను వెనక్కి నెట్టి ప్రధాన కీపర్గా అవకాశాలు అందుకున్నాడు. సంజూ తిరిగి వచ్చినా.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ మెగా టోర్నీలో సంజూ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా ఇషాన్ నిలిచాడు.