వ్యక్తిగత రికార్డుల కంటే ఐసీసీ ట్రోఫీలే ముఖ్యమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి స్పష్టం చేశాడు. గతంలో ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులను అతిగా సెలెబ్రేట్ చేసుకునే వాళ్లమని, వాటికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. వ్యక్తిగత మైలురాళ్ల కంటే ట్రోఫీలను గెలుచుకోవడాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చాడు. తాను కోచ్గా ఉన్నంత కాలం టీమిండియా ఇదే సిద్దంతాన్ని ఫాలో అవుతుందని స్పష్టం చేశాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ముచ్చటగా మూడో టీ20 ప్రపంచకప్ను అందుకోవడంతో పాటు వరుసగా రెండో టైటిల్ గెలిచిన జట్టుగా.. సొంతగడ్డపై టైటిల్ అందుకున్న టీమ్గా చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన గంభీర్.. ఈ టైటిల్ను మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితమిస్తున్నానని ప్రకటించాడు.
'మనం గతంలో వ్యక్తిగత మైలురాళ్లను (సెంచరీలు, హాఫ్ సెంచరీలు) అతిగా సెలబ్రేట్ చేసుకున్నాం. నా దృష్టిలో మైలురాళ్లు ముఖ్యం కాదు. ఐసీసీ ట్రోఫీలు మాత్రమే ముఖ్యం. మనం రికార్డులను సెలెబ్రేట్ చేసుకోవడం ఆపేసి.. ట్రోఫీలను సెలెబ్రేట్ చేసుకోవాలి. ట్రోఫీలే అన్నిటి కంటే ముఖ్యం. నేను కోచ్గా ఉన్నంత కాలం జట్టు ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది.

ఈ టీ20 ప్రపంచకప్ విజయాన్ని నేను రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితం ఇస్తున్నాను. భారత క్రికెట్ కోసం రాహుల్ భాయ్ చేసిన కృషి వెలకట్టలేనిది. అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీని లక్ష్మణ్ నడిపిస్తున్న తీరు వల్లే మనకు ఇలాంటి అద్భుతమైన యువ ఆటగాళ్లు లభిస్తున్నారు.
న్యూజిలాండ్, సౌతాఫ్రికా సిరీస్ల పరాజయం అనంతరం మేం విమర్శలు ఎదుర్కొన్నాం. ఆ సమయంలో నాకు మొదట ఫోన్ చేసి మద్దతుగా నిలిచింది జై షా భాయ్. ఆయన నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆటగాళ్లే కోచ్ను, కెప్టెన్ను గొప్పవారిగా మారుస్తారు. మైదానంలోకి వెళ్లి పోరాడి ట్రోఫీని గెలిచింది మా ఆటగాళ్లే.
ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా వారిదే. ఇందులో కోచ్గా నాది, కెప్టెన్గా సూర్య గొప్పతనం ఏం లేదు. ఆటగాళ్లు రాణించడంతోనే మాకు ఈ గుర్తింపు. జట్టులో ప్రతీ ఒక్కరు మ్యాచ్ విన్నర్లే. ఫైనల్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్లు అద్భుతం.’ అని గంభీర్ కొనియాడాడు.