ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ స్వయంకృతపరాధంతో విజేతగా నిలవలేకపోయిందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం అన్నాడు. వ్యూహాత్మక తప్పిదాలతో ఐసీసీ టైటిల్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన మూడు తప్పిదాలు ఆ జట్టు ఓటమిని శాసించాయని తెలిపాడు.
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో టీమిండియా వరుసగా రెండో టైటిల్ గెలవడంతో పాటు మూడో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. మరోవైపు న్యూజిలాండ్ మరోసారి రన్నరప్గా సరిపెట్టుకుంది.

ఓ యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఫైనల్ మ్యాచ్ను విశ్లేషించిన సబా కరీం అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుందని చెప్పాడు. 'సౌతాఫ్రికాతో మ్యాచ్లో న్యూజిలాండ్ ప్రదర్శించిన వ్యూహాత్మక చాతుర్యం ఫైనల్లో కనిపించలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే న్యూజిలాండ్ చేసిన మొదటి తప్పు. ఈ ప్రపంచకప్లో భారత్ ఒకే ఒక్క మ్యాచ్లో ఓడింది. అది కూడా అహ్మదాబాద్ వేదికగానే సౌతాఫ్రికాతో ఛేజింగ్లో తెలిపోయింది. అది తెలిసి కూడా న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకొని తప్పిదం చేసింది. న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సింది. కానీ వారు మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు.

రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన కోల్ మెక్కాన్చీని తుది జట్టు నుంచి తప్పించడం న్యూజిలాండ్ చేసిన రెండో తప్పిదం. సౌతాఫ్రికాతో మ్యాచ్లో మెక్కాన్చీని అద్భుత బౌలింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గ్లేన్ ఫిలిప్స్ను రెండో ఓవర్లో బౌలింగ్ చేయించడం న్యూజిలాండ్ చేసిన తప్పిదం. ఆ ఓవర్లో అతను ఐదు పరుగులే ఇచ్చినా.. మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు.
కెప్టెన్గా మిచెల్ సాంట్నర్ మైదానంలో చేసిన మూడు అతి పెద్ద వ్యూహాత్మక తప్పిదాలు ఇవే. అతను ఇలా చేయడం వింతగా అనిపించింది. ఎందుకంటే ఈ టోర్నీలో అతను కెప్టెన్గా అతని వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయి. న్యూజిలాండ్ పొరపాట్లు చేయకూడదని అనిపించిన తొలి మ్యాచ్ కూడా ఇదే.
ఈ తప్పిదాలను టీమిండియా క్యాష్ చేసుకుంది. వాస్తవానికి న్యూజిలాండ్ కంటే టీమిండియానే బలంగా ఉంది. హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగింది. ఇలాంటి మ్యాచ్ల్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ న్యూజిలాండ్ విచిత్రమైన నిర్ణయాలతో బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుంది.'అని సబా కరీం పేర్కొన్నాడు.
