ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత్ విజేతగా నిలిచినా.. పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ బలుపు మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మెగా టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా అమీర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అభిషేక్ శర్మ ఓ స్లాగర్ అంటూ విమర్శలు గుప్పించిన అమీర్.. భారత్ సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని అంచనా వేసాడు. సూపర్-8 దశలో భారత్ కంటే వెస్టిండీస్, సౌతాఫ్రికా బలంగా ఉన్నాయని చెప్పాడు.
సౌతాఫ్రికా, వెస్టిండీస్ చేతిలో ఓడిపోతుందని జోస్యం చెప్పగా.. సఫారీ చేతిలో ఓడిన భారత్.. వెస్టిండీస్పై గెలిచింది. సెమీఫైనల్లో ఇంగ్లండ్పై గెలిచే సత్తా టీమిండియాకు లేదని అమీర్ బల్ల గుద్ది చెప్పాడు. కానీ సంజూ శాంసన్ అసాధారణ ప్రదర్శనతో అతని అంచనాను తలకిందులు చేశాడు. ఫైనల్లోనూ న్యూజిలాండ్ విజయం చేస్తుందని చెప్పగా.. భారత్ గెలిచింది. దాంతో అమీర్ అంచనాలన్ని తలకిందులయ్యాయి.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ గెలిచిన అనంతరం.. ఓ టీవీ షోలో పాల్గొన్న అమీర్ను.. హోస్ట్ ప్రశ్నించాడు. 'అమీర్ భాయ్.. భారత్ ఫైనల్ గెలిచింది. మీ అంచనా తప్పని తేలింది. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?అని అడిగాడు. దానికి చిర్రెత్తుకుపోయిన అమీర్.. కోపంగా బదులిచ్చాడు. 'ఇండియా గెలిచింది. అది సరే. ఆ ట్రోఫీని నా ఇంటికి తీసుకురారు కదా. వాళ్ల ఇంటికే తీసుకెళ్లి సెలబ్రేట్ చేసుకుంటారు. సరే, బాగా ఆడారు'అని చిరాకుగా సమాధానం ఇచ్చాడు.
పక్కనే ఉన్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్.. 'వదిలేయ్ యార్, ఇవి కేవలం క్రికెట్ అంచనాలు మాత్రమే. అమీర్ తన అనుభవం ఆధారంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. దాన్ని భరించే గుణం మీకు ఉండాలి.'అని అండగా మాట్లాడాడు. అహ్మద్ షెహ్జాద్ మొదటి నుంచి భారత్కు అండగా మాట్లాడాడు. కొన్ని వ్యతిరేక కామెంట్స్ చేసినా.. భారత్ విజేతగా నిలుస్తుందని బల్లగుద్ది చెప్పాడు. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అమీర్పై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖం మీద కొట్టినట్లు భారత్ గెలిచినా.. అమీర్ బలుపు తగ్గలేదని మండిపడుతున్నారు. మనస్ఫూర్తిగా భారత్ విజయాన్ని అభినందించలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేయగా.. న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో టీమిండియా మూడో టీ20 ప్రపంచకప్ను ముద్దాడటంతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్గా టైటిల్ నిలబెట్టుకున్న జట్టుగా.. సొంతగడ్డపై ట్రోఫీ గెలిచిన టీమ్గా చరిత్ర సృష్టించింది.