2003 ప్రపంచకప్లో..
తన కెరీర్లో 6 వన్డే వరల్డ్ కప్లు ఆడిన మాస్టర్.. 2003 ప్రపంచకప్లో మాత్రం చెలరేగాడు. సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఆ మెగా టోర్నీ (2003)లో అతడి ఫామ్ ఆకాశాన్నంటింది. ఆ వరల్డ్కప్లో మొత్తం 11 మ్యాచ్లు ఆడిన సచిన్ రికార్డుస్థాయిలో 674 రన్స్ చేశాడు. దాయాది పాకిస్థాన్తో మ్యాచ్లో కండరాలు పట్టేసినా, ఆ నొప్పిని పంటి బిగవున అదిమిపట్టి 98 రన్స్ చేసి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. చాలామందికి ఈ మ్యాచ్లో సచిన్ కండరాల నొప్పి గురించి మాత్రమే తెలుసు. కానీ తదుపరి శ్రీలంకతో సూపర్ సిక్స్ దశ మ్యాచ్లో టెండూల్కర్ తీవ్ర ఆరోగ్య సమస్య ఎదుర్కొన్న విషయం ఎవరికీ తెలీదు.
నీళ్ల విరేచనాలతో బాధపడినా..
ఆ సమస్యేంటో సచినే తన ఆటో బయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే'లో వెల్లడించాడు. ‘నాకెరీర్లో తొలిసారి పాక్తో మ్యాచ్లో రన్నర్ సాయం తీసుకున్నా. కానీ ఆ మ్యాచ్ తర్వాత డయేరియా బారినపడ్డా. 500 కేజీల బరువు మోస్తున్న వ్యక్తి ఎలాగైతే నిలుచోలేడో ఆ విధంగా తయారైంది నా పరిస్థితి. పాక్తో పోరులో బాగా అలసిపోవడంతో తదుపరి శ్రీలంకతో మ్యాచ్కు కోలుకొనేందుకు అధిక మొత్తంలో ద్రవపదార్థాలు తీసుకున్నా. దీంతో నీళ్ల విరేచనాలు మొదలయ్యాయి. ఎనర్జీ డ్రింక్లో ఉప్పు కలుపుకుని తాగినా ప్రయోజనం కనిపించలేదు. అయినా లంకతో మ్యాచ్లో ఆడాలనే నిర్ణయించుకున్నా. టిష్యూ పేపర్లు పెట్టుకొని బ్యాటింగ్ చేశా. డ్రింక్స్ బ్రేక్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ వెళ్లేంత వరకూ అసౌకర్యంగానే అనిపించింది.'అని టెండూల్కర్ పేర్కొన్నాడు.
సవాళ్లు ఎదుర్కొవాలి..
ఇక జట్టును గెలిపించాలంటే కొన్ని సార్లు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొవాలని ఈ మ్యాచ్ ఘటనపై ఎదురైన ఓ ప్రశ్నకు సచిన్ సమాధానమిచ్చాడు. ‘జట్టును ఆదుకోవాల్సిన సందర్భాల్లో ఒక్కోసారి అలాంటి సవాళ్లు ఎదురవుతాయి. ఆ పరిస్థితుల్లో మనం బ్యాటింగ్ చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నామా లేదా అని ఆలోచించకుండా బరిలోకి దిగాల్సి ఉంటుంది. నేనూ అలానే చేశా' అని సచిన్ బదులిచ్చాడు.
షేన్ వాట్సన్ను మోచేతితో కావాలని ఢీకొట్టలేదు: గంభీర్
సచిన్ 97.. భారత్ ఘన విజయం..
అయితే ఇంత విపత్కర పరిస్థితిల్లో కూడా ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన మాస్టర్ 120 బంతుల్లో7 ఫోర్లు, 1 సిక్సర్తో 97 పరుగులు చేశాడు. డిసిల్వా బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సచిన్కు తోడుగా సెహ్వాగ్(66), గంగూలీ(48) పరుగులు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. అనంతర లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక.. శ్రీనాథ్(4/35), నెహ్రా(4/35), జహీర్(2/33) ధాటికి 23 ఓవర్లలోనే 109 పరుగులకు ఆలౌటై 183 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. శ్రీలంకలో ఐదుగురు బ్యాట్స్మన్ డకౌట్ కావడం గమనార్హం.