టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన వేళ.. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఈ సమయంలో భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫైనల్ మ్యాచ్లో కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ వైపు అర్ష్దీప్ దూకుడుగా బంతిని విసరడంపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఏమిటా వివాదం?
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలుపు దిశగా దూసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అర్ష్దీప్ తన రెండో ఓవర్ వేస్తున్నప్పుడు బంతిని అత్యంత దూకుడుగా డారిల్ మిచెల్ వైపు విసిరాడు. ఆ బంతి నేరుగా మిచెల్ భుజానికి తగలడంతో, మైదానంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీనిపై మిచెల్ అసహనం వ్యక్తం చేస్తూ అంపైర్కు ఫిర్యాదు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసకొచ్చాడు.

నిబంధనల ప్రకారం శిక్ష పడే అవకాశం ఉందా?
ఐసీసీ నిబంధనావళి ప్రకారం (Article 2.9), ఒక ఆటగాడు ప్రత్యర్థి బ్యాటర్ వైపు ప్రమాదకరమైన రీతిలో బంతిని విసరడం 'క్రీడా స్ఫూర్తికి విరుద్ధం'గా పరిగణించబడుతుంది. ఈ ఘటన లెవల్-1 ఉల్లంఘన పరిధిలోకి వస్తుంది. దీనిపై ఐసీసీ చర్య తీసుకుంటే.. అర్ష్దీప్కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించవచ్చు. అంతేకాకుండా, ఆయన ఖాతాలో ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లను చేర్చే అవకాశం ఉంది. గత 24 నెలల్లో ఒక ఆటగాడికి 4 డీమెరిట్ పాయింట్లు వస్తే, వారిపై నిషేధం విధించే నిబంధన కూడా ఉంది.
ప్రస్తుత పరిస్థితి:
మ్యాచ్ ముగిసిన తర్వాత అర్ష్దీప్ సింగ్, డారిల్ మిచెల్ను కలిసి తన తప్పును అంగీకరించి క్షమాపణలు కోరాడు. మిచెల్ కూడా ఆ క్షమాపణను అంగీకరించాడు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినప్పటికీ,..ఐసీసీ ఈ ఘటనను పరిశీలించి చర్యలు తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ ఇలాంటి తప్పు చేసినప్పుడు జరిమానా పడటంతో, అర్ష్దీప్ విషయంలో ఐసీసీ నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది. భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను గెలిచి చరిత్ర సృష్టించిన ఈ వేళ, అర్ష్దీప్ విషయంలో ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.