టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్తో ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న సెమీఫైనల్లో అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపర్చాడు. 7 బంతుల్లో 9 పరుగులే చేసి మరోసారి నిర్లక్ష్యపు షాట్కే వెనుదిరిగాడు. ఇంగ్లండ్ పార్ట్టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్లో ఔటై ఆఫ్ స్పిన్నర్ బలహీనతను బయటపెట్టుకున్నాడు.
ఈ ఓవర్ ఆరంభంలో రెండు బౌండరీలతో దూకుడు కనబర్చిన అభిషేక్ శర్మ.. స్టెప్ ఔటై భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ దూకుడును గమనించిన విల్ జాక్స్ తెలివిగా బంతి వేగాన్ని తగ్గించి ఫలితం రాబట్టాడు. ఈ ఓవర్లోని చివరి బంతిని విల్ జాక్స్ గంటకు 85.4 కిలోమీటర్ల వేగంతో సంధించాడు. బంతి వేగాన్ని అంచనా వేయడంలో విఫలమైన అభిషేక్ శర్మ మూల్యం చెల్లించుకున్నాడు. బ్యాట్ అంచున తాకిన బంతి గాల్లోకి లేవగా.. డీప్ మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న ఫిల్ సాల్ట్ సునాయసంగా అందుకున్నాడు. అభిషేక్ శర్మ వికెట్తో తొలి వికెట్కు నమోదైన 20 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
తీవ్రంగా నిరాశపర్చిన అభిషేక్ శర్మపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జుగుప్సాకరమైన కామెంట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. అభిషేక్ శర్మ జట్టుకు భారంగా మారాడని, కీలకమైన సెమీఫైనల్లో పేలవ షాట్తో జట్టును కష్టాల్లోకి నెట్టాడని మండిపడుతున్నారు. కొందరు అయితే అభిషేక్ శర్మ జట్టు నుంచి తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడుతున్నారు.

ఈ మెగా టోర్నీలో అభిషేక్ శర్మ ఐదుసార్లు ఆఫ్ స్పిన్నర్కే ఔటయ్యాడు. ఆఫ్ స్పిన్నర్ను ఎదుర్కోనే విషయంలో అభిషేక్ శర్మ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. దాంతో ప్రత్యర్థి జట్లు అభిషేక్ శర్మకు ఆఫ్ స్పిన్నర్తో బౌలింగ్ చేయించి కట్టడి చేస్తున్నాయి. ఐదు ఇన్నింగ్స్ల్లో ఆఫ్ స్పిన్నర్లకు వ్యతిరేకంగా 27 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ.. 29 పరుగులు మాత్రమే చేసి ఐదు సార్లు ఔటయ్యాడు. ఆఫ్ స్పిన్నర్లకు వ్యతిరేకంగా అతని సగటు.. 9.66 కాగా.. 107.40 స్ట్రైక్రేట్ మాత్రమే.
విధ్వంసకర టీ20 బ్యాటర్గా పేరుగాంచిన అభిషేక్ శర్మ.. భారీ అంచనాలతో ఈ టోర్నీలోకి అడుగుపెట్టాడు. కానీ వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్ అయిన అతను జింబాబ్వేపై హాఫ్ సెంచరీ బాదినా ఆ జోరు కొనసాగించలేకపోయాడు. కనీసం ఫైనల్లోనైనా అతన్ని తప్పించి మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే.. అభిషేక్ శర్మ కారణంగా టీమిండియా 10 మంది ఆటగాళ్లతోనే ఆడుతుందని కామెంట్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ.. మాకు ఏంటి ఈ కర్మ అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.