T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 నాకౌట్ సమరం మొదలైన వేళ.. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ పోరుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం జరగనున్న ఈ మ్యాచ్లో టీమిండియా గెలుపు గుర్రం ఎక్కాలంటే సూర్యకుమార్ యాదవ్ లేదా అభిషేక్ శర్మ కంటే.. మరో ఇద్దరు ఆటగాళ్లు అత్యంత కీలకం కానున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
బుమ్రా బౌలింగ్ మ్యాజిక్.. పవర్ ప్లే వ్యూహం
భారత బౌలింగ్ అస్త్రం జస్ప్రీత్ బుమ్రా గురించి సునీల్ గవాస్కర్ గొప్పగా చెప్పుకొచ్చారు. బుమ్రాను రీడ్ చేయడం బ్యాటర్లకు ఒక అంతుచిక్కని మిస్టరీ అనిృ.. అందుకే అతను అన్ని ఫార్మాట్లలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్గా మారాడని విశ్లేషించారు. సెమీఫైనల్ మ్యాచ్లో బుమ్రా పవర్ ప్లేలో కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేయాలని గవాస్కర్ సూచించారు. జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ వంటి వినాశకరమైన బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోక ముందే బుమ్రా తన పదునైన బంతులతో వారిని ఔట్ చేస్తే.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.

తిలక్ వర్మ.. టీమిండియా స్మార్ట్ క్రికెటర్
బ్యాటింగ్ విభాగంలో యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మపై గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. తిలక్ ఒక 'తెలివైన క్రికెటర్' అని, మైదానంలో పరిస్థితిని బట్టి తన ఆటను మార్చుకోగల సామర్థ్యం అతనికి ఉందని కొనియాడారు. మొదట మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్.. సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాక 5 లేదా 6వ స్థానానికి మారినప్పటికీ తన విలువైన సహకారాన్ని అందిస్తున్నాడని గుర్తు చేశారు. ముఖ్యంగా వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో సంజూపై ఒత్తిడి పడకుండా తిలక్ ఆడిన తీరు భారత్కు పెద్ద ప్లస్ పాయింట్ అని గవాస్కర్ విశ్లేషించారు.
బట్లర్తో ప్రమాదం .. ఇంగ్లాండ్ అనుభవం
ఇంగ్లాండ్ జట్టులో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు ఎక్కువమంది ఉన్నారని.. భారత్లోని వాంఖడే వంటి స్టేడియాల్లో ఒత్తిడిని ఎలా జయించాలో వారికి బాగా తెలుసునని గవాస్కర్ హెచ్చరించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రస్తుతం సరైన ఫామ్లో లేనప్పటికీ.. ఏ క్షణంలోనైనా విరుచుకుపడే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. బట్లర్ ఒకసారి కుదురుకుంటే అభిషేక్ శర్మ లాగా విధ్వంసం సృష్టించగలడని.. అందుకే అతని వికెట్ను ఆరంభంలోనే తీయడం భారత్ విజయావకాశాలకు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
వాంఖడేలో హ్యాట్రిక్ సమరం
భారత్, ఇంగ్లాండ్ జట్లు ప్రపంచకప్ సెమీఫైనల్స్లో తలపడటం ఇది వరుసగా మూడోసారి. 2022లో ఇంగ్లాండ్ విజయం సాధించగా.. 2024లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు 2026లో వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ఉండబోతోందని గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుమ్రా బౌలింగ్ బలం, తిలక్ వర్మ బ్యాటింగ్ ఫ్లెక్సిబిలిటీ భారత్కు ఇంగ్లాండ్పై ఒక అడుగు ముందుండేలా చేస్తాయని గవాస్కర్ విశ్లేషించారు.