ఎందుకంత ఆతృత? 70 సెంచరీలు ఆశామాషి విషయం కాదు.. కపిల్ దేవ్పై కోహ్లీ కోచ్ ఫైర్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని పక్కనపెట్టాలంటూ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరాట్ విషయంలో అంత ఆతృత ఎందుకని ప్రశ్నించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేయడం సాధారణమైన విషయం కాదని తెలిపాడు. గత రెండున్నరేళ్లుగా విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని పక్కనపెట్టాలని కపిల్ దేవ్ సూచించాడు.
రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో వరల్డ్ నెంబర్ 2 అని, అంతటివాడినే పక్కనబెట్టారని కపిల్ దేవ్ గుర్తు చేశాడు. అశ్విన్ వంటి మేటి బౌలర్నే తప్పించినప్పుడు, కోహ్లీని ఎందుకు పక్కన పెట్టరని ప్రశ్నించాడు. ఇన్నాళ్లుగా మనం చూసిన కోహ్లీ వేరని, ఇప్పుడు ఆడుతున్న కోహ్లీ వేరని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.

కోహ్లీని పక్కనపెట్టాల్సిందే..
'ఇప్పుడు టీ20ల్లో విరాట్ కోహ్లీని రిజర్వు బెంచ్లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అతని కంటే మెరుగ్గా ఆడుతున్న కుర్రాళ్లు, టీమ్లో ప్లేస్ కోసం గట్టిగా పోటీపడుతున్నారు. అయినా వరల్డ్ నెం.2 రవిచంద్రన్ అశ్విన్ని టెస్టుల్లో ఆడించకుండా పక్కనబెట్టినప్పుడు, వరల్డ్ నెం.1 బ్యాటర్ని పక్కనబెడితే తప్పేంటి... కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అతని స్టాండెడ్స్కి తగ్గట్టుగా ఉండడం లేదు. కోహ్లీకి ఇంతటి క్రేజ్ రావడానికి అతని పర్ఫామెన్స్లే కారణంగా. ఇప్పుడు అతను పర్ఫామెన్స్ చేయనప్పుడు, కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడంలో తప్పులేదు.'అని కపిల్ చెప్పుకొచ్చాడు.

70 సెంచరీలు చిన్న విషయం కాదు..
అయితే ఈ వ్యాఖ్యలపై స్పందిచిన రాజ్కుమార్ శర్మ.. అంత ఆతృత ఎందుకని నిలదీసాడు. ఎఎన్ఐతో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం సరైంది కాదన్నాడు. 'విరాట్ కోహ్లీని తప్పించాలంటూ కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలతో నేను ఏ మాత్రం సమర్థించను. ఆ వ్యాఖ్యలతో విరాట్ విషయంలో జరిగేది కూడా ఏం లేదు. విరాట్ విషయంలో కపిల్ దేవ్ ఎందుకింత ఆతృత ప్రదర్శిస్తున్నారు? విరాట్ భారత క్రికెట్కు ఎంతో చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేయడం చిన్న విషయం కాదు. కపిల్ సూచనలతో బీసీసీఐ.. విరాట్ను బెంచ్కే పరిమితం చేస్తుందని నేను ఏ మాత్రం అనుకోను.'రాజ్ కుమార్ శర్మ తెలిపాడు.

కోహ్లీ విఫలం..
ఇంగ్లండ్తో శనివారం జరిగిన రెండో టీ20లో విరాట్ కోహ్లీ(1) విఫలమయ్యాడు. ఎదుర్కొన్న మూడో బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి ఔటయ్యాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లే చివరి అవకాశామా? అతన్ని పక్కన పెట్టే యోచనలో సెలెక్టర్లు ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని 9 నెలలు అవుతున్నా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విరాట్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. పేలవ బ్యాటింగ్తో సతమతమవుతున్న అతను జట్టుకు భారంగా మారాడు.
మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమ్మేనేజ్మెంట్ టీమ్ కాంబినేషన్పై దృష్టిసారించింది. అయితే టీ20 ప్రపంచకప్ జట్టులో విరాట్ కోహ్లీకి చోటు దొరకడం కష్టంగా మారింది. ఇంగ్లండ్తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్లో రాణించడంపై కోహ్లీ భవితవ్యం ఆధారపడి ఉందని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఇండియాకు తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications