పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ మరోసారి టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్తో నేడు(గురువారం) జరిగే సెమీఫైనల్లో టీమిండియా ఓడిపోతుందని జోస్యం చెప్పాడు. భారత జట్టులో ఒకరిద్దరూ మినహా ఎవరూ రాణించడం లేదని తెలిపాడు. అంతేకాకుండా వాంఖడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని, ఇంగ్లండ్ ఛేజింగ్ చేస్తే ఈజీగా విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ టీవీ ఛానెల్కు చెందిన 'హర్నా మనా హై'షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
'మంచి వికెట్పై భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రషీద్ భాయ్(పాక్ మాజీ క్రికెటర్) చెప్పినట్లు ఇంగ్లండ్ ఛేజింగ్ చేస్తే ఆ జట్టు విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది హై స్కోరింగ్ గేమ్. భారత జట్టు విషయానికి వస్తే ఒకరిద్దరూ మినహా మిగతా బ్యాటర్లు ఫామ్లో లేరు. ఈ టోర్నీలో భారత జట్టు బ్యాటింగ్ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. భారత జట్టు బ్యాటింగ్ విభాగం పూర్తిగా తడబడుతోంది.

ఇషాన్ కిషన్ పాకిస్థాన్పై మాత్రమే ఆడాడు. అభిషేక్ శర్మ ఫామ్లోనే లేడు. తిలక్ వర్మ ఇప్పటి వరకు ప్రభావం చూపించలేదు. సూర్యకుమార్ యాదవ్ సూపర్-8 దశ నుంచి తడబడుతున్నాడు. సంజూ రాణించగా.. బౌలింగ్లో బుమ్రా అదరగొడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పలేం. అందుకే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఫేవరేట్ అని చెబుతున్నా.'అని అమీర్ చెప్పుకొచ్చాడు.
మహమ్మద్ అమీర్ అంచనా మరోసారి తప్పు కావచ్చు. కానీ అతను భారత్ బలహీనతను ఎత్తి చూపాడు. అమీర్ చెప్పినట్లుగా భారత బ్యాటింగ్ ప్రదర్శన అంత గొప్పగా లేదు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా ఇప్పటి వరకు సాధికారిక ప్రదర్శన చేయలేకపోయింది. అభిషేక్ శర్మ అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడు. ఇషాన్ కిషన్ తన జోరును కొనసాగించలేకపోయాడు.
సూర్యకుమార్ యాదవ్ కూడా తనదైన శైలిలో ఆడలేకపోతున్నాడు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. వెస్టిండీస్పై సంజూ శాంసన్ 97 పరుగులతో అజేయంగా నిలిచినప్పటికీ.. అతనిపై పూర్తి భరోసా ఉంచలేని పరిస్థితి. మరోసారి సమష్టిగా రాణిస్తేనే టీమిండియా ఫైనల్ చేరగలుగుతుంది. లేదంటే అమీర్ చెప్పినట్లు టీమిండియాకు ఓటమి తప్పదు.
ఈ మెగా టోర్నీ ఆరంభం నుంచే అమీర్ భారత్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నాడు. అభిషేక్ శర్మ ఓ స్లాగర్ అని విమర్శలు గుప్పించిన అతను.. భారత్ సెమీస్ చేరకుండానే సూపర్-8లో ఇంటి బాట పడుతుందని జోస్యం చెప్పాడు. కానీ సంజూ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా సెమీస్ చేరింది.