టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా న్యూజిలాండ్తో అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89 పరుగులు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ బ్యాటర్ మార్లోన్ సామ్యూల్స్(85 నాటౌట్), కేన్ విలియమ్సన్(85), మిచెల్ మార్ష్(77 నాటౌట్)ల రికార్డులను బద్దలు కొట్టాడు.
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
అంతేకాకుండా ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ శాంసన్కు వరుసగా ఇది మూడో హాఫ్ సెంచరీ. టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు కోల్పోయిన సంజూ శాంసన్.. కీలక మ్యాచ్ల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. వెస్టిండీస్తో డూ ఆర్ డై మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ.. ఇంగ్లండ్తో సెమీస్లో 86 పరుగులతో సత్తా చాటాడు. తాజా మ్యాచ్లో 89 పరుగులతో రాణించాడు. ఈ మూడు మ్యాచ్ల్లోనూ సెంచరీ చేసుకునే అవకాశం ఉన్నా.. జట్టు కోసమే దూకుడుగా ఆడబోయి వెనుదిరిగాడు.

ఇక సింగిల్ టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డ్ను సంజూ అధిగమించాడు. 2013-14 ఎడిషన్లో విరాట్ కోహ్లీ 319 పరుగులు చేయగా.. తాజా ఎడిషన్లో సంజూ శాంసన్ 5 మ్యాచ్ల్లోనే 321 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 9 ఇన్నింగ్స్ల్లో 317 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఎడిషన్లో పాకిస్థాన్ ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ 383 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
అభిషేక్ శర్మతో కలిసి ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ తొలి వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ చరిత్రలోనే ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. ఈ క్రమంలో అభిషేక్-సంజూ.. పాకిస్థాన్ ఓపెనింగ్ జోడీ కమ్రాన్ అక్మల్-షాజైబ్ హసన్ రికార్డ్ను అధిగమించాడు. 2009 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై ఈ జోడీ తొలి వికెట్కు 48 పరుగులు జోడించింది. ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్ జోడీగా ఉండగా.. అభిషేక్-సంజూ చరిత్రను తిరిగరాసారు.
ఈ టీ20 ప్రపంచకప్ 2026లో మొత్తం 24 సిక్స్లు బాదిన సంజూ శాంసన్.. ఒకే ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో సంజూ శాంసన్(24) తర్వాత ఫిన్ అలెన్(20), షిమ్రాన్ హెట్మైర్(19), సాహిబ్జాదా ఫర్హాన్(18), శివమ్ దూబే(18) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
